సదువు సాలెడు.. బలపాలు దోశెడు.. పిల్లోడి స్కూల్ టూర్కు రూ.2.5 లక్షలా?
ఇంటర్నేషనల్ టూర్స్ పేరుతో నేటి కార్పొరేట్, ఎలైట్ ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న భారీ ఫీజులపై సోషల్ మీడియా వేదికగా సరికొత్త చర్చకు తెరలేచింది. కేవలం ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి జపాన్ స్కూల్ ట్రిప్ కోసం ఏకంగా రూ.2.5 లక్షలు ఖర్చు చేయడంపై ఎక్స్ వేదికగా అల్కా గుర్హా అనే మహిళ పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. విద్యాపరమైన అనుభవాలు, గ్లోబల్ ఎక్స్పోజర్ పేరిట స్కూళ్లు గుంజుతున్న ఖర్చులు.. అసలు విద్యకయ్యే మొత్తం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైరల్ అయిన ఆ సోషల్ మీడియా పోస్ట్ వివరాల ప్రకారం.. సదరు విద్యార్థి జపాన్ పర్యటన కోసం పాఠశాల యాజమాన్యానికి రూ.2.5 లక్షల ఫీజు చెల్లించడమే కాకుండా, అక్కడ షాపింగ్, ఇతర వ్యక్తిగత ఖర్చుల కోసం తల్లిదండ్రులు అదనంగా మరో రూ.50,000 ఇచ్చి పంపించారు. అంతటితో ఆగకుండా, ఇదే విద్యార్థి కేవలం కొన్ని నెలల క్రితమే గోవాలో మూడు రోజులు గడపడానికి స్కూల్ ట్రిప్ కింద రూ.90,000 చెల్లించినట్లు సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ చిన్న విహారయాత్రకు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఏడాది పొడుగునా సంపాదించే ఆదాయాన్ని వసూలు చేయడంపై తల్లిదండ్రులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ రూ.2.5 లక్షల మొత్తం ఎంత పెద్దదో, విద్యా వ్యవస్థలో ఎలాంటి తేడాలు ఉన్నాయో అర్థం కావడానికి ఓ ఇంట్రెస్టింగ్ పోలికను తెరపైకి తెచ్చారు. దేశంలోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ విద్యా నెట్వర్క్ అయిన 'కేంద్రీయ విద్యాలయ' ఫీజులతో ఈ మొత్తాన్ని పోల్చి చూస్తున్నారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అధికారిక నిబంధనల ప్రకారం.. 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఉండదు. వారు కేవలం విద్యాలయ వికాస్ నిధి, కంప్యూటర్ ఫండ్ వంటి ఐచ్ఛిక రుసుములు మాత్రమే చెల్లిస్తారు. ఇవన్నీ కలిపినా ఒక విద్యార్థికి ఏడాదికి సగటున రూ.8,000 నుండి రూ.10,000 లోపే ఖర్చవుతుంది.
ఈ లెక్కన విశ్లేషిస్తే.. ఒక ప్రైవేట్ స్కూల్ కేవలం కొద్ది రోజుల జపాన్ ట్రిప్కు వసూలు చేసిన రూ.2.5 లక్షల మొత్తం.. కేంద్రీయ విద్యాలయంలో ఒక విద్యార్థి ఏకంగా 25 నుంచి 30 ఏళ్ల పాటు చదువుకోవడానికి అయ్యే మొత్తం ఫీజుతో సమానం. అంటే ఒక విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థలో ఒకటో తరగతి నుంచి పీజీ లేదా పీహెచ్డీ పూర్తి చేసేంత ఖర్చును, ప్రైవేట్ పాఠశాలలు ఒకే ఒక్క అంతర్జాతీయ విహారయాత్ర పేరుతో కొన్ని రోజుల్లోనే ఖర్చు చేయిస్తున్నాయి. ఈ పోలిక విద్యా రంగంలో పెరిగిపోయిన వ్యాపార దృక్ఫథాన్ని స్పష్టంగా ఎత్తిచూపుతోంది.
Friend paid 2.5 lacs for her son's school trip to Japan. Class 8. Plus extra 50 k for shopping. He bought a branded limited edition shoe for 19 k in Japan.
— AG (@alkagurha) June 7, 2026
3 months ago she paid 90 k for Goa, 3 N, plus cash for expenses.
Is it any surprise people have only one kid?
ప్రస్తుతం దేశంలో ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలు గ్లోబల్ ఎక్స్పోజర్, సాంస్కృతిక మార్పిడి, ప్రాక్టికల్ లెర్నింగ్ అంటూ జపాన్, సింగపూర్, యూరప్, అమెరికా వంటి దేశాలకు విహారయాత్రలను తమ వార్షిక క్యాలెండర్లో తప్పనిసరి భాగంగా మారుస్తున్నాయి. ఇలాంటి పర్యటనల వల్ల పిల్లల్లో ప్రపంచంపై అవగాహన, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని స్కూల్ యాజమాన్యాలు సమర్థించుకుంటున్నప్పటికీ.. వీటికి అయ్యే ఖర్చులు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. విమాన ప్రయాణ ఛార్జీలు, విదేశీ హోటల్ వసతి, ట్రావెల్ ఇన్సూరెన్స్, గైడ్ ఫీజుల పేరిట బిల్లులను లక్షల్లోకి నెట్టేస్తున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్న కుటుంబాలకు ఈ ఖర్చులు భరించడం అసాధ్యంగా మారుతోంది.
విదేశీ పర్యటనల సంగతి పక్కన పెడితే.. దేశీయంగా ప్లాన్ చేసే గోవా, జైపూర్ వంటి ప్రాంతాల పర్యటనలకు కూడా మూడు రాత్రుల ప్యాకేజీకి రూ.90,000 వసూలు చేయడంపై తల్లిదండ్రుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలాంటి ఖరీదైన ట్రిప్స్ వల్ల స్కూళ్లలో చదివే పిల్లల మధ్య ఆర్థిక అంతరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రుల పిల్లలు ఇలాంటి పర్యటనలకు వెళ్లలేక, తమ క్లాస్మేట్స్ ముందు తీవ్రమైన అభద్రతాభావానికి, ఒక రకమైన అలిఖిత వివక్షకు గురవుతున్నారు. ఇది పిల్లల మానసిక స్థితిపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వివాదం కేవలం ఓ జపాన్ ట్రిప్ గురించింది మాత్రమే కాదు. ఇండియాలో రోజురోజుకూ పెరిగిపోతున్న విద్యా అసమానతలకు ఇది అద్దం పడుతోంది. ఒకవైపు కొన్ని వేల రూపాయలకే నాణ్యమైన చదువును అందించే కేంద్రీయ విద్యాలయాలు, మరోవైపు కేవలం కొన్ని రోజుల విలాసవంతమైన పర్యటనల కోసమే లక్షలు గుంజే ఎలైట్ ప్రైవేట్ పాఠశాలలు.. సమాజంలో ఉన్న వర్గ భేదాలను పాఠశాల స్థాయిలోనే పిల్లల మైండ్లో నాటుతున్నాయి. ఈ క్రమంలో "విద్యాపరమైన అవకాశం ఎక్కడ ముగుస్తుంది? విద్యా విలాసం ఎక్కడ మొదలవుతుంది?" అనే అత్యంత కీలకమైన ప్రశ్నపై ఇప్పుడు సమాజంలో లోతైన విశ్లేషణలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications