ఒక్క స్టే తో 4 వేల కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరట-ఉత్తరాఖండ్ హైకోర్టు ఉత్తర్వులకు బ్రేక్..
ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ ప్రాంతంలోని ఓ రైల్వే స్ధలాన్ని ఆక్రమించుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారిని అక్కడి నుంచి తొలగించేలా ఆక్రమణల తొలగింపు డ్రైవ్ చేపట్టాలంటూ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. దీంతో అక్కడ నివాసముంటున్న 4 వేల కుటుంబాలకు భారీ ఊరట దక్కినట్లయింది.
ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న గౌలా నదిలో అక్రమ తవ్వకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై స్పందించిన హైకోర్టు.. సుమోటోగా ఆక్రమణల వ్యవహారాన్ని విచారించాలని నిర్ణయించింది. అనంతరం ఆక్రమణలపై రైల్వే అధికారుల్ని దర్యాప్తుకు ఆదేశించింది. 2017లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి రైల్వే జరిపిన ఉమ్మడి సర్వే తర్వాత అక్కడ 4365 ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. డిసెంబర్ 20న అక్కడ 29 ఎకరాలను ఆక్రమించుకున్న 4 వేలకు పైగా కుటుంబాలను ఖాళీ చేయించాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది. దీంతో కలకలం రేగింది. వేల మంది నివాసముంటున్న ప్రాంతం కావడంతో ప్రభుత్వం కూడా ఇరుకునపడింది.

ఈ నేపథ్యంలో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇవాళ ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. రాత్రికి రాత్రే వేల కుటుంబాలను ఎలా ఖాళీ చేయిస్తారని ప్రశ్నించింది. ఇకపై అక్కడ ఎలాంటి అక్రమ కట్టడాలు రాకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుతో అక్కడ నివాసముంటున్న 4 వేలకు పైగా కుటుంబాలకు భారీ ఊరట దక్కింది. అలాగే ఉత్తరాఖండ్ సర్కార్ కూ ఊరట లభించినట్లయింది.












Click it and Unblock the Notifications