ఎలక్టోరల్ బాండ్లలపై ఈసీ, కేంద్రం భిన్న వాదనలు శుక్రవారం తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు
ఢిల్లీ : ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెల్లడించనుంది. ఎన్నికల బాండ్లను రద్దు చేయాలంటూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్, మరికొందరు దాఖలు చేసిన పిటీషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు శుక్రవారానికి వాయిదా వేసింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు వాటిని కొనసాగించాలన్న కేంద్రం అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
క్యూలైన్లో నిల్చున్న ఓటర్లకు నమో ఫుడ్ ప్యాకెట్స్..నివేదిక కోరిన ఈసీ
కేంద్రం, ఈసీ భిన్న వాదనలు
ఎన్నికల బాండ్ల రూపంలో రాజకీయపార్టీలు నిధులు సమీకరించడంపై కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఎదుట భిన్న వాదనలు వినిపించాయి. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచాలని కేంద్రం తన అఫిడవిట్లో కోరింది. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం పారదర్శకతకు పెద్దపీట వేసేలా ఎన్నికల బాండ్లు కొనుగోలుదారుల వివరాలు బహిర్గతం చేయాలని స్పష్టంచేసింది.
నల్లధనం నివారణకు బాండ్లు
ఎలక్షన్ బాండ్లను కొనసాగించాలన్న నిర్ణయాన్ని కేంద్రం సమర్థించుకుంది. ఎన్నికల్లో నల్లధనాన్ని నివారించేందుకు బాండ్లను ప్రవేశపెట్టారని అటార్నీ జనరల్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. కొందరు షెల్ కంపెనీల ద్వారా బ్లాక్ మనీని ఎన్నికల సమయంలో ఖర్చు చేస్తారని బాండ్ల వల్ల అలాంటి పరిస్థితి తలెత్తదని కోర్టుకు విన్నవించారు. అట్నారి జనరల్ వాదనలపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం సుదీర్ఘంగా చర్చించినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయింది.
కొనుగోలుదారుల వివరాలపై ఆరా
ఎలక్షన్ బాండ్లు కొనుగోలు చేసే వారి వివరాల గురించి సుప్రీంకోర్టు ఆరాతీసింది. బాండ్ కొనేవారి పూర్తి సమాచారం బ్యాంకుల వద్ద ఉంటుందా అని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన అటార్నీ జనరల్.. కస్టమర్లకు సంబంధించిన కేవైసీ బ్యాంకుల వద్ద ఉంటాయని సమాధానం ఇచ్చారు. ఏజీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా కేవైసీ ఉన్నంత మాత్రాన వారు బాండ్ల కొనుగోలుకు చెల్లించిన డబ్బు బ్లాక్ మనీ అవునో కాదో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.