గ్రీన్ జోన్లలో గ్రీన్ సిగ్నల్..? జూలైలో స్కూల్స్ రీ ఓపెన్, 8 ఆ పై తరగతులు, 30 శాతం హాజరు...
జూన్ నెల వచ్చేస్తోంది. ఈ మాసంలోనే దేశవ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకుంటాయి. అయితే కరోనా వైరస్ వల్ల కేజీ నుంచి తొమ్మిదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. వైరస్ విజృంభిస్తోన్న క్రమంలో.. స్కూళ్లు రీ ఓపెన్ చేయడంపై కేంద్ర మానవవనరుల శాఖ దృష్టిసారించింది. స్కూళ్లను కూడా జోన్లవారీగా ఓపెన్ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రాల నుంచి నివేదిక తెప్పించుకొని.. మరీ కసరత్తు చేస్తోంది.

గ్రీన్, ఆరంజ్ జోన్లలో..
తొలుత గ్రీన్, ఆరంజ్ జోన్లలో గల స్కూళ్లను మాత్రమే తెరుస్తారు. కేజీ నుంచి ఏడో తరగతి వారికి మాత్రం పర్మిషన్ ఇవ్వరు. చిన్న పిల్లలను ఇళ్లలోనే ఉంచాలని భావిస్తున్నారు. తెరిచిన స్కూళ్లలో 8 నుంచి ఆపై తరగతుల వారికి... 30 శాతం విద్యార్థులతో మాత్రమే అనుమతిస్తారు. పాఠశాల తరగతి గదిలో భౌతిక దూరం తప్పనిసరి అని మానవవనరులశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ స్పష్టంచేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి మరీ స్కూళ్లు తెరుస్తామని సంకేతాలు ఇచ్చారు.

మాస్క్, గ్లౌజ్ కంపల్సరీ...
స్కూళ్లలో టీచర్స్.. విధిగా మాస్క్ ధరించాలని, గ్లౌజ్ వేసుకోవాలని, పాఠశాలలో థర్మల్ స్కానర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ముగ్గురు విద్యార్థులు కూర్చొనే చోట.. ఇద్దరు మాత్రమే కూర్చొవాలని స్పష్టంచేశారు. తరగతి గదిలో భౌతికదూరానికి సంబంధించి.. ఎప్పటికప్పుడు సీసీటీవీ పుటేజీ పరిశీలిస్తామని తెలిపారు. తమ పరిధి స్కూళ్లలో కరోనా వైరస్ నివారణ చర్యలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించాల్సి ఉంటుందని తెలిపారు. స్కూళ్ల మాదిరిగానే కాలేజీలు, వర్సిటీలలో కూడా మార్గదర్శకాలను యూజీసీ సిద్దం చేసిందని మంత్రి తెలిపారు. మరోవైపు ఎన్సీఆర్టీఈ కూడా సీబీఎస్ఈని సిలబస్ తగ్గించమని కోరినట్టు తెలుస్తోంది.

పెరిగిన సెంటర్లు
వైరస్ వల్ల సీబీఎస్ఈ ఎగ్జామ్ సెంటర్లను కూడా పెంచారు. భౌతికదూరం పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అయితే రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదు. అలాంటి స్కూళ్లలో.. సంబంధిత పాఠశాలల్లోనే పరీక్షలు నిర్వహించమని బోర్డు కోరింది. దీంతో ప్రయాణం తగ్గుతుంది. దగ్గరలోని స్కూళ్లలోనే పరీక్షలు నిర్వహించే వెసులుబాటు కలుగుతుంది. కేరళ బోర్డు.. ఎస్ఎస్సీ పరీక్షలను మంగళవారం నుంచి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్లలో ఇప్పట్లో స్కూళ్లు తెరిచే అవకాశం లేదు. గ్రీన్, ఆరంజ్ జోన్లలో 8 ఆ పై తరగుతులు.. 30 శాతం విద్యార్థులతో జూలైలో ఓపెన్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications