గూగుల్లో వెతికితే రేప్లే: సిఎం వ్యాఖ్య, బెదిరింపులని...
లక్నో: ఉత్తర ప్రదేశ్లో వరుస అత్యాచారాల పైన తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్ర ఒత్తిడికి లోనైనట్లుగా కనిపిస్తోంది. ఆయన మంగళవారం అత్యాచారాల పైన స్పందించిన విషయం తెలిసిందే. మీరు గూగుల్ సెర్చ్లో వెతికితే... దేశవ్యాప్తంగా అన్ని అలాంటి వార్తలే కనిపిస్తాయని అఖిలేష్ వ్యాఖ్యానించడం గమనార్హం.
అలాంటి సంఘటనలు కేవలం యూపిలోనే జరగడం లేదని, దేశమంతా జరుగుతున్నాయన్నారు. తాను దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాల పైన స్టాటిస్టిక్స్ ఇస్తానని, అప్పుడు తనను ప్రశ్నించాలన్నారు. ఇది గూగుల్ ఎరా అని, అందులో వెతికితే తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
మరోవైపు బుదాన్ జిల్లాలో ఇద్దరు యువతుల పైన అత్యాచారం చేసి, చెట్టుకు వేలాడదీసిన విషయం తెలిసిందే. అయితే వారి కుటుంబ సభ్యులు తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
మీడియా ఇప్పుడు వస్తుంది.. వెళ్తుందని, అలాగే నాయకులు కూడా ఇలాగే వస్తారు.. వెళ్తారని.. ప్రభుత్వం మాత్రం మరో మూడేళ్లు ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాభారత్ (యుద్ధం) సృష్టిస్తామని తమకు బెదిరింపులు వస్తున్నాయని వారు అంటున్నారు.