పూరీ జగన్నాథుని ఆలయంలో రహస్య గది... సొరంగ మార్గం.. వెలకట్టలేని సంపద
ఒడిసాలోని పూరీలో కొలువైన జగన్నాథస్వామి ఆలయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. స్వామివారి శ్రీక్షేత్ర రత్నభాండాగారంలో సంపద ఎంత ఉంది? అందులో ఉండే మూడోగదిని ఎందుకు తెరవడంలేదు? అనే విషయాలపైనే తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ భాండాగారానికి చెందిన మూడో గది నుంచి రహస్యంగా సొరంగ మార్గం ఉందని, అందులో అపార సంపద ఉందని సమాచారం. వజ్ర వైఢూర్యాలు, గోమేధికాలు, పుష్పరాగాలు, రత్నాలు, స్వర్ణ కిరీటాలు, కెంపులు... ఇలా ఎన్నో అందులో నిక్షిప్తమై ఉన్నట్లు తెలుస్తోంది.
1926లో అప్పటి బ్రిటీష్ పాలకులు ఈ రత్న భాండాగారాన్ని తెరిపించారు. చెన్నైకి చెందిన నిపుణులు ఆ ఆభరణాలను లెక్కించి 597 రకాల ఆభరణాలున్నాయని తేల్చారు. ఆ సంపదను వెలకట్టలేమని, ధనుర్బాణాలు, రత్నాలు, స్వర్ణ కిరీటాలు.. ఇలా ఎన్నో ఉన్నట్లు శ్రీక్షేత్ర ఆస్తుల పట్టికలో రాసివున్నట్లు ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ సురేంద్ర మిశ్ర పూరీలో ఇటీవల మీడియాకు తెలిపారు. రహస్యగది దిగువన సొరంగమార్గం ఉందని, దాని కింద మరిన్ని గదులున్నాయని అప్పట్లో చెన్నెకి చెందిన నిపుణులు తెలియజేసినట్లు డాక్టర్ మిశ్ర వివరించారు. ఆస్తుల గురించి రాసిన పట్టికలో ఒక వివరం రాసివుందని చెప్పారు.

దాని ప్రకారం తాము భూగర్భంలో ఉన్న గదులకు వెళ్లలేకపోయామని, లోపల నుంచి సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయని పేర్కొన్నట్లు మిశ్ర వెల్లడించారు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఒడిశాను 46 మంది రాజులు పరిపాలించారు. వారంతా పురుషోత్తముడి భక్తులని, ఆ రాజులే స్వామి వారి కోసం వెలకట్టలేని సంపదను రహస్య గదుల్లో భద్రపరిచారని డాక్టర్ సురేంద్ర మిశ్రా వెల్లడించారు.












Click it and Unblock the Notifications