వంటింట్లో 144 సెక్షన్ విధించాల్సిందే: మండిపోతున్న టమాటా ధరలపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్!!
దేశవ్యాప్తంగా టమాట ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్ ధరలను మించి టమాట ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదంటూ సామాన్యులు విలవిలలాడుతున్నారు. విపరీతంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టమాట సాగు చేసిన అనేక ప్రాంతాలలో టమాట సాగు దెబ్బతినడంతో, టమాటాకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఒక్కసారిగా టమాట ధర జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న పరిస్థితి దేశానికి ఆందోళన కలిగిస్తుంది.
విస్తారమైన వర్షాల కారణంగా దేశం అంతటా టమాటా ధరలు పెరిగాయి. కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కిలోకు 100 రూపాయలకి పైగా టమాట ధరలు చేరుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ధరల నియంత్రణలో కేంద్రం విఫలమవుతోందని విమర్శిస్తుంది
విపరీతంగా పెరిగిన టమాటా ధరలు ..ఎక్కడ ఎంత ఉన్నాయంటే
దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో టొమాటో ధరలు భారీగా పెరగడానికి నవంబర్ మొదటి వారం నుండి ఇప్పటివరకు విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు కారణమని తెలుస్తుంది. వర్షం కారణంగా టమోటా పంట దెబ్బతినడంతో సరఫరాలో కొరత ఏర్పడింది. డిమాండ్ కు తగ్గట్టు సరఫరా లేకపోవటంతో ధరలు అమాంతం పెరిగాయి.
కేరళలోని కొట్టాయంలోని ప్రజలు కిలో టమోటాలకు 120 రూ, ఎర్నాకులం వారు కిలో 110 రూ, తిరువనంతపురం 103 రూ, పాలక్కాడ్ 100 రూ, త్రిసూర్ 97 రూ, వాయనాడ్ మరియు కోజికోడ్లోని వారు 97 రూపాయలను చెల్లించి టమాటాలను కొనుగోలు చేస్తున్నారు . చెన్నైలో కిలో టమాటా వంద రూపాయలు, పుదుచ్చేరిలో 90 రూపాయలు, బెంగళూరులో 28 రూపాయలు, హైదరాబాద్లో కిలో వంద రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు.
చిత్తూరులో 150 రూపాయలు పలికిన టమాటా ధర
కర్ణాటకలో, ధార్వాడ్లో కిలో రూ.85, మైసూరులో రూ.84, మంగళూరులో కిలో రూ.80, బళ్లారిలో కిలో రూ.78గా ఉంది. ఇక చిత్తూరులో టమాటా ధర కిలో 150 రూపాయలు పలుకుతుంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కిలో రూ.91, విశాఖపట్నంలో కిలో 80 రూపాయలు, తిరుపతిలో కిలో వంద రూపాయలకు పైగా పలుకుతుంది. అయితే, దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 167 కేంద్రాల వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఢిల్లీలో టొమాటోలు కిలో రూ.72 చొప్పున విక్రయించబడుతున్నాయి. వర్షాల కారణంగా దక్షిణ భారతదేశం నుండి ఢిల్లీకి టమోటా సరఫరా ప్రభావితమైంది.
వంటింట్లో 144 సెక్షన్ విధించుకోండి ... ధరల పెరుగుదలపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్
ద్రవ్యోల్బణం వంటి వాస్తవ సమస్యల నుండి కులం మరియు మత పరమైన సమస్యల వైపుకు ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. వంటగదిలో సెక్షన్ 144 విధించుకోవాలని, వంటింట్లో నాలుగు టమోటాలు, నాలుగు ఉల్లిపాయల కంటే ఎక్కువ ఉంచుకోకూడదని పవన్ ఖేరా ఎద్దేవా చేశారు. తమ వైఫల్యాలను దాచిపెట్టి లేని సమస్యలను సృష్టించడం ద్వారా ఈ ప్రభుత్వం దేశం యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం చేయడాన్ని తాము అనుమతించమని ఆయన పేర్కొన్నారు.
వర్షాలు ఇలా కొనసాగితే ధరలు మరింత పెరిగే ప్రమాదం
ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలు రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగితే, దేశ రాజధానిలోనే కాదు, దేశ వ్యాప్తంగా ధరలు ప్రస్తుత స్థాయి కంటే పెరిగే అవకాశం ఉంది అని ఆజాద్పూర్ టమోటా అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ చెప్పారు. నేషనల్ హార్టికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ డేటా ప్రకారం, చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద టమోటా ఉత్పత్తిదారుగా ఉంది. భారతదేశంలో హెక్టారుకు సగటున 25.05 టన్నుల దిగుబడితో 7.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణం నుండి 19.75 మిలియన్ టన్నుల టమాటాలను ఉత్పత్తి చేస్తుంది.