Vandebharat Special : వందేభారత్ తొలిరోజు స్పెషల్ టైమింగ్స్ -21 స్టేషన్లలో ఆగనున్న రైలు..
తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభానికి గడువు దగ్గరపడుతోంది. ఈ ఆదివారం అంటే జనవరి 15న సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఈ రైలు నడిచే వేళలు, ఆగే స్టేషన్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జనవరి 15న ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించనుండగా.. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్ సికింద్రాబాద్ స్టేషన్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సికింద్రాబాద్ లో ప్రారంభమయ్యే ఈ రైలుకు తొలిరోజు మాత్రం ప్రత్యేక వేళల్ని నిర్ణయించారు. ప్రారంభం, గమ్య సమయాలతో పాటు ఆగే స్టేషన్లను తొలిరోజుకు మాత్రం ప్రత్యేకంగా నిర్ణయించారు. దీంతో తొలిరోజు ప్రయాణించే ప్రయాణికులకు మాత్రం కొన్నిచిక్కులు తప్పేలా లేవు.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రయాణికులకు, ప్రజలకు పరిచయం చేసేందుకు వీలుగా అది ప్రయాణించే సికింద్రాబాద్ - విశాఖ మార్గంలో ఉన్న దాదాపుగా అన్ని స్టేషన్లలోనూ తొలిరోజు ఆపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరే రైలును తెలంగాణలోని చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిరలో ఆపనున్నారు.
ఆ తర్వాత ఏపీలోకి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రవేశించనుంది. ఏపీలోకి ఎంటరైన తర్వాత కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, స్టేషన్లలో ఆపనున్నారు. చివరిగా విశాఖకు ఈ వందే భారత్ స్పెషల్ రైలు రాత్రి 8.45 గంటలకు చేరుకోనుంది.












Click it and Unblock the Notifications