భారత్లో తాలిబన్లకు అనుకూలంగా గొంతు: ప్రధాన పార్టీ ఎంపీపై దేశద్రోహం కేసు
లక్నో: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్ను ఆక్రమించుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతోన్న తాలిబన్లకు అనుకూలంగా భారత్లో గళం వినిపిస్తోంది. ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. తాలిబన్లకు అనుకూలంగా ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఆయనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేశ ద్రోహం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరిపైనా కేసు పెట్టారు పోలీసులు.
భారత్ సహా ప్రపంచ దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న తాలిబన్ల చర్యలను ప్రోత్సహించేలా ఆ పార్టీ లోక్సభ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతోన్నాయి. ఆ ఎంపీ పేరు- షఫిక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్. ఉత్తర ప్రదేశ్లోని సంభాల్ లోక్సభ స్థానానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ తరఫున ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు.

తాలిబన్లు ఆక్రమణను షఫిక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్ స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణించారు. ఏకంగా భారత స్వాతంత్ర్య పోరాటంతో పోల్చారు. భారతీయుల పోరాటం, తాలిబన్ల పోరాటం దాదాపు ఒక్కటేనని పేర్కొన్నారు. తాలిబన్లది కూడా ఒకరకంగా స్వాతంత్య్ర పోరాటమేనని చెప్పుకొచ్చారు. తమ దేశానికి స్వేచ్ఛ కావాలని తాలిబన్లు కోరుకున్నారని, ఆ ఉద్దేశంతోనే వారు పోరాడారని షఫిక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్ కితాబిచ్చారు. తాము అనుకున్నది సాధించారని అన్నారు.
అమెరికా, రష్యా వంటి దేశాల జోక్యం లేకుండానే వారు తమ దేశానికి స్వేచ్ఛ కల్పించారని చెప్పారు. అదంతా ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారమని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే భారతీయ జనతా పార్టీ నాయకులు స్పందించారు. షఫిక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన వ్యాఖ్యానాలను తప్పు పట్టారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉంటూ తాలిబన్ల దురాక్రమణను భారత స్వాతంత్ర్య పోరాటంతో పోల్చడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.
సిగ్గు లేకుండా సమాజ్వాది పార్టీ ఎంపీ తాలిబన్లను సమర్థిస్తున్నారని మండిపడ్డారు. తాలిబన్లను సమర్థించడం అంటే వారి దురాక్రమణ, మారణ హోమాన్ని సైతం అంగీకరించినట్టే అవుతుందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా షఫిక్ రెహ్మాన్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్తో పోల్చారు.
వారిద్దరి మధ్య పెద్ద తేడా కనిపించట్లేదని ధ్వజమెత్తారు. బీజేపీ ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ప్రాంత ఉపాధ్యక్షుడు రాజేష్ సింఘాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షఫిక్ రెహ్మాన్పై పోలీసులు దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. సంభాల్ పోలీస్ స్టేషన్లో ఆయనపై 124ఎ (దేశద్రోహం), 153ఎ, 295 ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను ఎవరు చేసినా దేశద్రోహం కింద కేసులు నమోదు చేయాలంటూ రాజేష్ సింఘాల్ డిమాండ్ చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంతటి వారైనా సరే.. ఏ మాత్రం ఉపేక్షించకూడదని చెప్పారు.












Click it and Unblock the Notifications