ఆ తర్వాతే రాజద్రోహంపై ఎఫ్ఐఆర్- సుప్రీంకోర్టులో కేంద్రం కీలక ప్రతిపాదన
దేశవ్యాప్తంగా రాజద్రోహం కేసుల నమోదు తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ఇవాళ మరోసారి సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది. చట్టం పరిధిలో రాజద్రోహం కేసులు నమోదు కావడం లేదనే వాదనల నేపథ్యంలో ఈ కాలం చెల్లిన బ్రిటీష్ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు కేంద్రం నిర్ణయం తీసుకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
దేశద్రోహ చట్టం కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టుకు చట్టం పునఃపరిశీలన కోసం కేంద్రం ముసాయిదాను సిద్ధం చేసిందని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇవాళ వెల్లడించారు. ఎస్పీ స్థాయి పోలీసు అధికారి సరైన కారణం చెబితేనే దేశద్రోహ ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఈ ముసాయిదా పేర్కొంది. చట్ట పరిధిలో శిక్షించే నేరం జరిగిన చోట రాజ్యాంగ న్యాయస్ధానం దీనిపై స్టే ఇవ్వడం సరికాదని తుషార్ మెహతా వాదించారు. జ్యుడీషియల్ అథారిటీ కింద బాధ్యతాయుతమైన సీనియర్ అధికారి దీనిపై పరిశీలన చేసే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.
దేశద్రోహ చట్టం ప్రయోగానికి సంబంధించి పెండింగ్లో ఉన్న కేసుల గురించి మాట్లాడుతూ, ఇది గుర్తించదగిన నేరమని , పెండింగ్లో ఉన్న ప్రతి నేరం తీవ్రత తమకు తెలియదన్నారు. ఉగ్రవాదం, మనీలాండరింగ్ లేదా మరేదైనా నేరం ఉండవచ్చని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిందితులు బెయిల్ దరఖాస్తు చేసుకున్నప్పుడు కోర్టు ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం ఉందని, కానీ పూర్తిగా సెక్షన్ 124ఏను నిలిపివేయడం సరికాదని మెహతా అన్నారు.
మహాత్మాగాంధీని అడ్డుకోవడానికి బ్రిటీష్ వారు వాడిన రాజద్రోహం చట్టాన్ని మీరు ఇంకా కొనసాగించాలనుకుంటున్నారా అని గతంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించంది. దేశద్రోహ చట్టాన్ని దుర్వినియోగం చేయడం, దానిని ఉపయోగించడంలో ఏజెన్సీల జవాబుదారీతనంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ చట్టం దుర్వినియోగానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది.