ఏకంగా జడ్జీ కుర్చీలో కూర్చుని సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్!: కటకటాలపాలు
భోపాల్: సెల్ఫీల మోజులో పడి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నా యువత మాత్రం సెల్ఫీ పిచ్చి నుంచి తేరుకోవడం లేదు. సమయం సందర్భం లేకుండా సెల్ఫీలు తీసుకుంటూ ఇబ్బందులెదుర్కోవడంతోపాటు విమర్శలపాలవుతున్నారు.
తాజాగా, మధ్యప్రదేశ్లోని ఓ జిల్లా న్యాయమూర్తి కుర్చీలో కూర్చొని సెల్ఫీలు దిగిన ట్రైనీ కానిస్టేబుల్ కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రామ్ అవతార్ రావత్ అనే వ్యక్తి ఉమారియా పోలీస్ అకాడమీలో ట్రైనీగా ఉన్నాడు.
శనివారం రోజు జిల్లా కోర్టుకు వెళ్లిన రావత్.. కోర్టు ప్రాగణంలోని న్యాయమూర్తి గది తెరచి ఉండటంతో అందులోకి వెళ్లాడు. న్యాయమూర్తి సీటులో కూర్చొని సెల్ఫీలు దిగసాగాడు.
కాగా, రావత్ సెల్ఫీలు దిగడాన్ని గమనించిన గుమస్తా శక్తిసింగ్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రావత్పై కేసు నమోదు చేసి, వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఇలా చేశాడా? లేక సాధారణంగానే ఇలా ప్రవర్తించాడా? అనే విషయంపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.