కరోనా విజృంభణ: తమిళనాడు సీఎం వ్యక్తిగత సహాయకుడు మృతి
చెన్నై: తమిళనాడులో కరోనా విజృంభిస్తూనేవుంది. ఇప్పటికే మహారాష్ట్ర తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులున్న రెండో రాష్ట్రంగా తమిళనాడు అవతరించిన విషయం తెలిసిందే. మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తున్నాయి. ఇటీవలే కరోనా బారిన పడి డీఎంకేకు చెందిన ఓ ఎమ్మెల్యే మరణించిన విషయం తెలిసిందే.
తాజాగా, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యక్తిగత సహాయకుడు కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. సీఎం పీఏ దామోదరన్(56) కరోనా బారిన పడి మృతి చెందారని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆయన సీఎం వద్ద సీనియర్ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
కాగా, దామోదరన్ రెండు రోజుల క్రితమే కరోనా లక్షణాలతో చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం దామోదరన్ మరణించినట్లు అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు.
మరోవైపు చెన్నైలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న క్రమంలో జూన్ 19 నుంచి 12 రోజులపాటు మరోసారి పూర్తి లాక్డౌన్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు జిల్లాలో ఈ లాక్డౌన్ను అమలు చేయనుంది. ఈ 12 రోజుల్లో వచ్చే రెండు ఆదివారాల్లో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తామని ప్రకటించింది.
Recommended Video
తమిళనాడులో ఇప్పటి వరకు 48,019 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20,709 యాక్టివ్ కేసులున్నాయి. 26,782 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి 528 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,55,060 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,55,375 యాక్టివ్ కేసులున్నాయి. 1,87,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 11,922 మంది కరోనాతో మరణించారు.