వరుసగా ఐదో రోజు.. భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు!
ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లన్నింటిలో అమ్మకాల జోరు కొనసాగడంతో... దాని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా పడింది.
వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ పాలసీలను మరింత కఠినతరం చేయబోతున్నాయనే అంచనాలు మదుపరుల సెంటిమెంట్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఒకానొక సమయంలో 550 పాయింట్ల వరకు పతనమయింది.
చివరి గంటలో స్వల్ప కొనుగోళ్లతో తిరిగి కొంచెం పుంజుకుని 310 పాయింట్ల నష్టంతో 34,757 వద్ద ముగిసింది. నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయి 10,666 వద్ద స్థిరపడింది. తద్వారా నిప్టీ ప్రధాన మద్దతు స్థాయి10700ని కోల్పోయింది.
మెటల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, బ్యాంకింగ్ సెక్టార్ భారీగా నష్టపోయింది. ప్రధానంగా ప్రైవేటు బ్యాంకులు ఇండస్ఇండ్, కోటక్మహీంద్ర, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యస్బ్యాంక్, ఐసీఐసీఐ షేర్ల నష్టాలు మార్కెట్ దిశను ప్రభావితం చేశాయి.
అలాగే మైండ్ట్రీ, ఫోర్టిస్, అజంతా ఫార్మా, ఎక్సైడ్, బాలకృష్ణ, గోద్రెజ్ఇండస్ట్రీస్, స్టార్, ఎన్బీసీసీ, అదానీ, ఎల్ అండ్ టీ కూడా నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. బోష్, కోల్ ఇండియా, పవర్గ్రిడ్ , టెక్మహీంద్ర, టాటా మెటార్స్ (ఫలితాలపై అంచనాలతో), భారతి ఎయిర్టెల్ పీసీ జ్యుయలరీ లాభపడ్డాయి.