వేర్పాటువాద నేత ఫోటోతో పోస్టర్: జమ్మూ సర్కార్పై విమర్శలు
జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమానికి సంబందించిన పోస్టర్లో వేర్పాటువాద నేత ఆసియాఆండ్రబి ఫోటో ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. జమ్మూ సర్కార్పై తీవ్ర విమర్శలు చేల
శ్రీనగర్: 'బేటీ బచావో బేటీ పఢావో' ప్రచారం జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో తీవ్ర వివాదాస్పదమైంది. ఇందిరాగాంధీ, మదర్ థెరిస్సా వంటి ప్రముఖులు చోటుచేసుకున్న ప్రచార పోస్టర్లో వేర్పాటువాద నేత అసియా ఆండ్రబి ఫోటో ముద్రించారు.
ఈ పోస్టర్పై జమ్మూకశ్మీర్ సర్కార్పై ఒక్కసారిగా విమర్శలు వెల్లువత్తడంతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించింది.
దుక్తరన్-ఇ-మిల్లత్కు చెందిన కశ్మీర్ వేర్పాటు వేత అసియా ఆండ్రబి భారత్ వ్యతిరేక ప్రసంగాలు చేసింది., భారత గడ్డపై పాకిస్థాన్ జెండా ఎగురవేయడం వంటి పలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆమెపై కేసులున్నాయి. కొద్దికాలం క్రితం ఉగ్రవాద సంస్థ హిబ్జుల్ కమాండర్ బుర్హాన్ వనీని ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుబెట్టిన అనంతరం రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి హింసాకాడను ప్రోత్సహించారన్న ఆరోపణలపై ప్రస్తుతం ఆమె జైలులో ఉంది.
భేటీ బచావో...ప్రచారంలో భాగంగా ప్రతిభావంతులు, ఉన్నత స్థాయిని అందుకున్న మహిళలతో కూడిన పోస్టర్లతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ శిశు సంక్షేమ విభాగం ప్రచారం చేపట్టింది. బుధవారంనాడు అనంతనాగ్ జిల్లాలో శ్రీకారం చుట్టిన ఈ ప్రచారంలో ప్రజలతో పాటు పలువురు పోలీసు అధికారులు, స్థానిక, పౌర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రదర్శించిన పోస్టర్లలో మెహబూబా ముఫ్తీతో పాటు, మాజీ ప్రదాని ఇందిరాగాంధీ, మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడి, సుప్రసిద్ధ సినీ నేపథ్యగాయని లతా మంగేష్కర్ తదితర మహిళా ప్రముఖులు చోటుచేసుకున్నారు.
అయితే వీరి పక్కనే అసియా అండ్రబి ఫోటో చోటుచేసుకోవడం ప్రచారంలో పాల్గొన్న అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అనుసరిస్తున్న బుజ్జగింపు విధానానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలంటూ మెహబూబా ముఫ్తీపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే స్పందించిన మెహబూబా సర్కార్ ఒక అధికారిని సస్పెండ్ చేయడంతో పాటు తక్షణ దర్యాప్తునకు ఆదేశించింది.