ఐఏఎఫ్ అధికారి హత్య.. శవాన్ని ముక్కలు చేసి 16బ్యాగుల్లో ప్యాక్!
శుక్లా ఇంటికి వచ్చాక ముగ్గురు కలిసి అతని హత్య చేసి 16బ్యాగుల్లో అతని అవయవాలను ప్యాక్ చేశారు.
బతిండా: బిసియానా ఎయిర్ బేస్ పరిధిలోని బతిందా సమీపంలో ఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే అతని హత్యకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. హత్యానంతరం అతని శరీరాన్ని ముక్కలు ముక్కులుగా కోసేయడం గమనార్హం.
హత్యకు గురైన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ కు చెందిన విపన్ శుక్ల(27)గా గుర్తించారు. పోలీస్ శాఖలో కిందిస్థాయిలో పనిచేసే సులేశ్ కుమార్, అతని భార్య మరియు బావమరిది కలిసి విపన్ శుక్లను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
కాగా, ఫిబ్రవరి 8న విపన్ శుక్ల హత్యకు గురవగా మంగళవారం నాడు ఆలస్యంగా ఘటన వెలుగుచూసింది. సులేశ్ కుమార్ ఇంట్లో విపన్ శుక్ల మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం సులేశ్ కుమార్ సహా అతని భార్య అనురాధ పటేల్, నేవి వ్యాపారిగా పనిచేస్తున్న అతని బావమరిది శశి భూషణ్ ను పోలీసులు అరెస్టు చేశారు.
హత్య జరిగిన సమయంలో శశిభూషణ్ తన చెల్లెల్ని కలవడానికి సులేశ్ కుమార్ ఇంటికి వచ్చాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విపన్ శుక్ల భార్య కుంకుమ్ తన భర్త కనిపించడం లేదంటూ ఫిబ్రవరి 9న బల్లూనా పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
శుక్ల భార్య ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో డాగ్ స్క్వాడ్ తో శుక్ల ఇంటి పరిసరాల్లో నిందితుల కోసం గాలించారు. దీంతో సులేశ్ కుమార్ ఇంటి వద్ద డాగ్ తచ్చాడుతూ ఆగిపోయింది. ఇంట్లోకి వెళ్లి తనిఖీలు చేయగా శుక్ల మృతదేహాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ బ్యాగుల్లో ప్యాక్ చేసి ఫ్రిజ్, అల్మారాల్లో దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
2014లో బిసియానా పరిధిలో శుక్లాకు పోస్టింగ్ ఇవ్వగా.. భార్యను ఇంటి దగ్గరే ఉంచి తానొక్కడే ఇక్కడకు వచ్చాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు సులేశ్ కుమార్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే గాక ఆమెను గర్భవతిని చేశాడు. దీంతో తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా సులేశ్ భార్య శుక్లాను ఒత్తిడి చేసింది.
అయితే శుక్లా అందుకు నిరాకరించాడు. ఆ తర్వాత 2016, డిసెంబర్ లో భార్యను తనవద్దకే తీసుకువచ్చుకున్నాడు. ఇదే క్రమంలో సులేశ్ కుమార్ ఒత్తిడితో అనురాధ అతనికి అసలు విషయం చెప్పేసింది.
ఈ నేపథ్యంలో శుక్లాను హత్య చేయాలని సులేశ్ కుమార్ ప్లాన్ వేశాడు. పథకం ప్రకారం ఫిబ్రవరి 8న శుక్లాను ఇంటికి పిలిపించాడు. అదే సమయంలో తన బావమరిదికి కూడా కబురుపెట్టాడు. శుక్లా ఇంటికి వచ్చాక ముగ్గురు కలిసి అతని హత్య చేసి 16బ్యాగుల్లో అతని అవయవాలను ప్యాక్ చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో అసలు గుట్టు రట్టయింది.