ఎవరు పెట్టిన చిచ్చు?: దక్షిణ కర్ణాటకలో హైటెన్షన్.. బీజేపీపై భగ్గుమన్న సీఎం
వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలన్న ఉద్దేశంతోనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ చిచ్చు పెడుతున్నాయన్న ఆరోపణ అధికార పార్టీ నుంచి బలంగా వినిపిస్తోంది.
బెంగళూరు: మత కలహాలతో దక్షిణ కర్ణాటక అట్టుడుకుతోంది. వరుసగా చోటు చేసుకున్న మూడు హత్యలు మత కలహాలతోనే ముడిపడి ఉండటంతో ఆ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలన్న ఉద్దేశంతోనే మతాల మధ్య బీజేపీ, ఆర్ఎస్ఎస్ చిచ్చు పెడుతున్నాయన్న ఆరోపణ అధికార పార్టీ నుంచి బలంగా వినిపిస్తోంది. మతాల మధ్య మంట పెట్టడం బీజేపీ పని అని, వాటిని తాము చల్లారుస్తామని సీఎం సిద్దరామయ్య ఎద్దేవా చేశారు.
బంట్ వాల్ తాలుకాలోని ప్రాంతమంతా గత 50రోజులుగా రగులుతూనే ఉంది. ఎప్పుడూ శాంతియుతంగా ఉండే దక్షిణ కర్ణాటకలో నెలన్నర రోజుల నుంచి నిషేధాజ్ఞలు కొనసాగుతుండటం గమనార్హం. 144వ సెక్షన్ కింద విధించిన ఈ నిషేధాజ్ఞలు మరో రెండు వారాలపాటు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. మత కలహాల నేపథ్యంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు.
మే 26వ తేదీన ఓ ముస్లిం యువకుడిని కొంతమంది వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేయడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇది కాస్త మత కలహాలకు దారి తీసింది. దీంతో తొలిసారిగా బంట్ వాల్ ప్రాంతంలో నిషేధాజ్ఞలు తప్పలేదు.
ఆపై జూన్ 21వ తేదీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఆటో డ్రైవర్ ఆష్రాఫ్ కలాయ్(35)ని గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు హత్య చేశారు. ఆటో నుంచి అతన్ని బయటకు లాగి మరి హత్య చేసి పరారయ్యారు. ఇక గత జులై 4న శరత్ మడివాలా అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో.. మూడు రోజుల పాటు చికిత్స పొంది అతను మరణించాడు.
వరుసగా జరిగిన ఈ మూడు హత్యల్లోను మత కలహాల ప్రమేయమే ఎక్కువగా ఉంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య తర్వాత ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జులై 8వ తేదీన జరిగిన నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న హిందువులు రాళ్లు, సీసాలు విసిరారు.
వచ్చే సంవత్సరం కర్ణాటకలో ఎన్నికలు ఉన్నందునా.. హిందూ-ముస్లిం మధ్య చీలిక తెచ్చి లబ్ది పొందాలని బీజేపీ,ఆర్ఎస్ఎస్ లు భావిస్తున్నాయని అధికార పార్టీ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అల్లర్లతో సంబంధమున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఇప్పటికే సీఎం సిద్దరామయ్య బహిరంగంగా పిలుపునిచ్చారు.
సిద్దరామయ్య పిలుపును సవాల్ చేస్తూ.. ఇటు మాజీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కౌంటర్ ఇచ్చారు. ఎలా అరెస్టు చేస్తారో చూస్తామంటూ ప్రతి సవాల్ విసిరారు. దీనిపై మరింత ఫైర్ అయిన సిద్దరామయ్య.. తాను అసలు సిసలైన హిందువునని, తన పేరు సిద్దరాముడని, బీజేపీది దొంగ హిందూ సిద్దాంతమని విమర్శించారు.
మరోవైపు మాజీ ప్రధాని దేవెగౌడ నిర్వహించనున్న శాంతి ప్రదర్శనలో పాల్గొనాలంటూ కాంగ్రెస్, బీజేపీలకు జనతాదళ్(సెక్యులర్) నాయకుడు కుమారస్వామి పిలుపునివ్వడం గమనార్హం.