భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు: ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి
బెంగళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా బెళగావిలోని బదల అంకాలగి గ్రామంలో ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో ఆ ఇంట్లో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
పాత ఇల్లు కావడంతో భారీ వర్షానికి తడిసిపోయి కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందినవారికి పరిహారం ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున చనిపోయిన కుటుంబసభ్యులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాలని జిల్లా ఇంఛార్జీ మంత్రి గోవింద్ కర్జోల్, జిల్లా డిప్యూటీ కమిషనర్ను ఆదేశించారు ముఖ్యమంత్రి. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

కారును ఢీకొని లోయలో పడ్డ బస్సు: ఒకరు మృతి, 11 మందికి గాయాలు
పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బట్టుపల్లి సమీపంలోని గాడుదలగండి గుట్టపైన బస్సు-కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. మంథని నుంచి భూపాలపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు వాహనాలు అదుపుతప్పి పక్కనే ఉన్న చిన్నపాటి లోయలోకి దూసుకెళ్లాయి.
ప్రమాదంలో మంథని మండలం ఖాన్సాయిపేటకు చెందిన కారు డ్రైవర్ వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది ఉండగా, 11 మందికి గాాయలయ్యాయి. భూపాలపల్లికి చెందిన లక్ష్మీ, మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సోఫియా, శ్వేత, మరియా, అంజయ్యలకు తీవ్రగాయాలు కావడంతో వారిని మెరుగైన చికిత్స కోసం గోదావరిఖనిలోని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. వీరిలో లక్ష్మీ, మరియా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications