'రాహుల్ గాంధీ నిజంగా వస్తున్నారా? వచ్చినప్పుడు చూద్దాం'
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఏప్రిల్ 19వ తేదీన రైతు ఆందోళనలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా, నమ్మకం లేదని అధికార భారతీయ జనతా పార్టీ చెబుతోంది. బీజేపీ అధికార ప్రతినిధి షాన్వాజ్ హుస్సేన్ గురువారం నాడు ఢిల్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ రాక పైన ఆర్ యూ ష్యూర్ అంటూ ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ ఈ నెల 19వ తేదీన తిరిగి వస్తారన్న కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా షాన్వాజ్ స్పందిస్తూ.. ఆర్ యూ సీరియస్ (ఇది నమ్మదగిందేనా) అంటూ ఎదురు ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ వస్తారనే తేదీ (ఏప్రిల్ 19)న ఆయన నిజంగానే వస్తారా అనే విషయమై మనకు తెలియదన్నారు. రాహుల్ రాక పైన ఏ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా ప్రకటన చేయలేదని చెప్పారు.
అతను ఏం ప్రణాళికతో వస్తున్నారు? అతను ఎప్పుడు అందర్నీ కలుస్తారు? అతని వెకేషన్ పూర్తయిందా.. ఈ విషయాలన్నీ అతను తిరిగి వచ్చాక మాట్లాడుకోవచ్చునని ఎద్దేవా చేశారు.
కాగా, గత కొద్ది రోజులుగా రాహుల్ గాంధీ బయటకు రాని విషయం తెలిసిందే. రాహుల్ ఏప్రిల్ 19వ తేదీన ఢిల్లీలో జరిగే రైతు ఆందోళన పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు దీని పైన బీజేపీ వర్గాలు చురకలు అంటిస్తున్నాయి.