సోనియా స్ధానంలో యూపీఏ ఛైర్మన్గా శరద్ పవార్ - రూమర్లపై క్లారిటీ ఇచ్చిన ఎన్సీపీ బాస్
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలో కాలుష్యం దృష్ట్యా డాక్టర్ల సూచన మేరకు ఆమె తాజాగా గోవా తరలివెళ్లారు. రోజువారీ కార్యక్రమాల్లో కూడా సోనియా ప్రస్తుతం అంత చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. దీంతో యూపీఏ ఛైర్పర్సన్గా సోనియాగాంధీ స్ధానంలో ఆమె తర్వాత సీనియర్గా ఉన్న శరద్ పవార్కు బాధ్యతలు కట్టబెడతారనే ప్రచారం జరుగుతోంది.
యూపీఏ ఛైర్పర్సన్గా సోనియాగాంధీ స్ధానంలో తనకు బాధ్యతలు కట్టబెడతారంటూ జరుగుతున్న ప్రచారంపై శరద్ పవార్ స్పందించారు. ఈ ప్రచారం అంతా ఒట్టిదేనని పవార్ తేల్చేశారు. రేపటితో 80 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న పవార్ ఈ రూమర్లపై స్పందిస్తూ ఇదంతా మీడియా ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలే అన్నారు. అది నిజం కాదన్నారు. వాస్తవానికి యూపీఏ ఛైర్పర్సన్గా పవార్కు అవకాశం దక్కితే తాము మద్దతిస్తామని ఇప్పటికే మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని నడుపుతున్న శివసేన ప్రకటించింది.

కాంగ్రెస్ ప్రస్తుతం పూర్తిగా బలహీనపడిందని, శరద్ పవార్ వంటి వారు ముందుకొచ్చి యూపీఏ ఛైర్పర్సన్ బాధ్యతలు చేపడితే తాము స్వాగతిస్తామని శివసేన తాజాగా ప్రకటించింది. కానీ పవార్ ఆ పదవిని తిరస్కరిస్తున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
యూపీఏలో అతి పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ లోక్సభలో విపక్ష పాత్రను సమర్ధంగా నిర్వహించలేకపోతోందని రౌత్ తెలిపారు. దీంతో యూపీఏను బలోపేతం చేయాల్సిన అవసరమొచ్చిందని వెల్లడించారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడగా లేనిది దేశంలో బలమైన యూపీఏ ఏర్పాటు చేయలేమా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications