'రాజకీయం' మార్చేశారు: మరోసారి మోడీపై శశిథరూర్ ప్రశంసలు
జైపూర్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రశంసల వర్షం కురిపించారు. గతంలోను ఆయన మోడీని ఆకాశానికెత్తారు. ఇప్పుడు రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న లిటరరీ ఫెస్ట్లో ఆయన మోడీని పొగిడారు.
దేశంలో రాజకీయాలను ప్రధాని మోడీ మార్చి వేశారన్నారు. మోడీ చరిత్రలో స్థానం సంపాదించుకోవచ్చునన్నారు. అయితే, తాము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పారు. గుర్తింపు కోసం ఉన్న రాజకీయాలను ఆయన పర్ఫార్మెన్స్, అభివృద్ధి రాజకీయాలుగా మార్చారని కితాబిచ్చారు. షైనింగ్ ఇండియాను మోడీ తన నినాదాన్ని మార్చుకున్నారన్నారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ పైన గతంలో కూడా శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. దీని పైన కేరళ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అతనిని అధికార ప్రతినిధి పదవి నుండి అధిష్టానం తప్పించింది. ఇప్పుడు మరోసారి మోడీని పొగడటం గమనార్హం.

కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జనార్ధన్ ద్వివేది కూడా ప్రధాని మోడీకి కితాబిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకుల్లో ఒకరైన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జనార్దన్ ద్వివేదీపై పార్టీ సస్పెన్షన్ వేటు వేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించటంతోపాటు ఇటీవల లోకసభ ఎన్నికల్లో దేశ ప్రజలు భారతీయతకు ఓటు వేశారంటూ ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఏఐసిసి మీడియా విభాగం అధ్యక్షుడు అజయ్ మాకెన్ గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి హిందీ భాషను నేర్పించటంతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇంఛార్జ్గానూ ద్వివేది వ్యవహరించారు. ఆయన బుధవారం రిడీఫ్ డాట్కామ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గత లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలు భారతీయతకు ఓటు వేసినందువల్లే కాంగ్రెస్ ఓడిపోయింది. అందుకే నరేంద్ర మోడీ విజయం సాధించారు' అని వ్యాఖ్యానించారు.
దేశ ప్రజలు భారతీయతకు ఓటు వేశారనటం కాంగ్రెస్ విధానానికి వ్యతిరేకమని అజయ్ మాకెన్ స్పష్టం చేశారు. భారతదేశం భిన్నజాతులు, మతాల సంగమమని ఆయన చెప్పారు. జనార్దన్ ద్వివేదీ లాంటి సీనియర్ నాయకుడు ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదని అన్నారు.












Click it and Unblock the Notifications