పోలింగ్ కేంద్రం దగ్గర కుప్పకూలిన ఎమ్మెల్యే, ఎన్నికల్లో పోటీ, మాజీ సీఎం మోసం, ఐసీయూలో!
Recommended Video
బెంగళూరు: చివరి నిమిషంలో అధిష్టానం రివర్స్ గేర్ వెయ్యడంతో ఆందోళనలో ఉన్న కర్ణాటక ఎమ్మెల్యే గుండెపోటుతో పోలింగ్ కేంద్రం సమీపంలో కుప్పకూలిపోయిన ఘటన ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని శిడ్లఘట్టలో జరిగింది. పరిస్థితి విషమంగా ఉండంటంతో శిడ్లఘట్ట సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజక వర్గం స్వంతత్ర పార్టీ అభ్యర్థి రాజన్నకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మాజీ సీఎం మోసం చేశారని ఆవేదనతో రాజన్నకు గుండెపోటు వచ్చిందని ఆయన సన్నిహితులు అంటున్నారు.
పోలింగ్ కేంద్రాలు
శనివారం శిడ్లఘట్ట నియోజక వర్గంలో జోరుగా పోలింగ్ జరుగుతోంది. శిడ్లఘట్ట సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్న పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్నారు. ఆ సందర్బంలో గుండెపోటుతో రాజన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను శిడ్లఘట్టలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
జేడీఎస్ ఎమ్మెల్యే
2013లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రాజన్న జేడీఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2018 ఎన్నికల్లో రాజన్నకు జేడీఎస్ పార్టీ బీఫారం ఇచ్చింది. రాజన్నకు ఇచ్చిన బీఫారం చివరి నిమిషంలో రద్దు చేసిన జేడీఎస్ చివరికి బీఎన్. రవికుమార్ కు టిక్కెట్ ఇచ్చింది.
కుమారస్వామి హామీ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి హామీతో రాజన్న స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రచారం చేశారు. అయితే పోలింగ్ కు ఒక్క రోజు ముందు (శుక్రవారం) హెచ్.డి.కుమారస్వామి జేడీఎస్ కార్యకర్తలు అందరూ రవికుమార్ కు మద్దతు ఇవ్వాలని వీడియో సందేశం పంపించారు.
చివరికి మాజీ సీఎం రివర్స్
పోలింగ్ కు కొన్ని గంటల ముందు తనకు హామీ ఇచ్చిన మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి రివర్స్ గేర్ వెయ్యడంతో రాజన్న తీవ్రనిరాశకు గురైనారు. ఆవేదనతో శనివారం పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు.
పరిస్థితి విషమం
రాజన్న ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు చెప్పడంతో ఆయన అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు నగరంలోని జయనగర బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో కుప్పకూలి చికిత్స విఫలమై మరణించండంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే.