విధ్వంసానికి దిగిన శివసేన.. రైతుల కోసమా? అధికారం కోసమా?
పుణే: మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. పుణేలోని ఓ ప్రైవేటు బీమా కార్యాలయంపై బుధవారం ఉదయం దాడికి తెగబడ్డారు. చేతికి అందిన ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కార్యాలయం అద్దాలను పగుల గొట్టారు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్, ఇతర విలువైన పరికరాలను నేలకు విసిరి కొట్టారు. రైతులకు పంట రుణాలను సకాలంలో చెల్లించకపోవడం, వారి నుంచి బలవంతంగా రుణాలను వసూలు చేస్తుండటం వల్లే శివసేన కార్యకర్తల ఆగ్రహానికి కారణమైందని చెబుతున్నారు. ఈ ఘటనపై పుణే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. సుమారు 35 మంది శివసేన కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
కొద్ది రోజుల కిందట మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. మూడు నెలలుగా తరచూ కురుస్తోన్న భారీ వర్షాల వల్ల వేలాది హెక్టార్లలో పంట నీట మునిగింది. కృష్ణా, ఇతర నదులు ఉప్పొంగి ప్రవహించడంతో చాలా చోట్ల పంట పొలాలు వరదల్లా మారాయి. పలు గ్రామాల్లో పంట పొలాలు ఇప్పటికీ నీట్లోనే నానుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పంట రుణాల కోసం ప్రైవేటు బీమా కంపెనీలను ఆశ్రయిస్తున్నారు అక్కడి రైతులు. పుణే కోరేగావ్ పార్క్ సమీపంలోని ఇఫ్కో టోకియో ప్రైవేటు బీమా కంపెనీని రైతులు రుణాల కోసం ఆశ్రయించగా.. అక్కడి సిబ్బంది దౌర్జన్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
దీనితో పాటు ఇదివరకే ఇచ్చిన రుణాలను వెంటనే చెల్లించాలంటూ పట్టుబట్టినట్లు చెబుతున్నారు. దీనితో వారి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు రైతులు శివసేన కార్యకర్తలకు ఈ సమాచారాన్ని అందజేయగా.. వారు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా రైతులు పంట రుణాలను తీసుకున్నారని, భారీ వర్షాలు వరదల వల్ల పంట నష్టపోవడంతో రైతులు రుణాలను సకాలంలో చెల్లించలేకపోవచ్చని శివసేన పుణే విభాగం నాయకులు చెబుతున్నారు. అలాాంటి దుస్థితిలోనూ రుణాలను చెల్లించాలంటూ బీమా సంస్థ సిబ్బంది రైతులపై ఒత్తిడిని తీసుకొస్తున్నారని, దీన్ని నిరోధించడానికి వారు ఈ దాడి చేసి ఉంటారని అంటున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే కోరేగావ్ పార్క్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు వస్తున్నారనే సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. వారు వచ్చే సరికి శివసేన కార్యకర్తలు పారిపోయారు. కార్యాలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తిస్తామని పుణే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రవీంద్ర రాసల్ తెలిపారు. నిందితులను గాలించడానికి ఇప్పటికే మూడు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. దాడి చేయడానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని అన్నారు.