బాబును అడగకుంటే ఎలా: పురంధేశ్వరిపై బిజెపికి ఉద్దవ్
ముంబై: భారతీయ జనతా పార్టీ కొత్త పొత్తులు, పార్టీలో చేరికల పైన మహారాష్ట్రకు చెందిన శివసేన మండిపడుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పేరును ప్రస్తావించారు. రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పార్టీని ఎన్డీయేలోకి తీసుకునే అంశంపై శివసేన అధినేత ఉద్దవ్ థాకరే బిజెపిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త మిత్రుల కోసం పాతవారిని వదులుకుంటారా అని ఘాటుగా ప్రశ్నించారు. ఆయా ప్రాంతాల్లో పొత్తులు పెట్టుకునే ముందు జాగ్రత్తలు తీసుకునేది లేదా అన్నారు. పార్టీలో చేరికల విషయాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. పురంధేశ్వరి, చౌతాలను పార్టీలోకి తీసుకునే ముందు అక్కడి మిత్రులను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
బిజెపి మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కరీ ఎంఎన్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజ్ థాకరేతో భేటీ కావడాన్ని తప్పు బట్టారు. శివసేన పత్రిక సామ్నాలో బిజెపి వైఖరిని దుయ్యబట్టారు.
కుల్దీప్ బిష్నోయ్ను సంప్రదించకుండా ఓం ప్రకాశ్ చౌతాలను ఎలా చేర్చుకున్నారన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో మాట్లాడకుండా పురంధేశ్వరిని ఎలా చేర్చుకున్నారన్నారు. ఇలాంటి పరిణామాలతో భవిష్యత్తులో ఎన్డీయేకు నష్టమని అభిప్రాయపడ్డారు.
కాగా, పురంధేశ్వరి ఇటీవల బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. అదే సమయంలో బిజెపి - టిడిపిల మధ్య పొత్తు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పురంధేశ్వరి, చంద్రబాబులకు ఒకరంటే ఒకరు పడదు. ఈ నేపథ్యంలో టిడిపితో పొత్తు కోరుకుంటూ.. ఆ పార్టీతో మాట్లాడకుంటా పురంధేశ్వరిని బిజెపిలో చేర్చుకోవడాన్ని ఉద్దవ్ థాకరే ప్రశ్నించారు.