ఒప్పందం: కేంద్రమంత్రి బాధ్యత స్వీకరించిన అనంత్ గీతే
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన శివసేన తమకు కేటాయించిన ఒకే ఒక మంత్రి పదవిపై మొదట అసంతప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత బిజెపితో కుదిరిన ఒప్పందం మేరకు బుధవారం శివసేన పార్టీ ఎంపి అనంత్ గీతే భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణం చేసిన సమయంలోనే అనంత్ గీతే కూడా కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
అయితే తనకు కేటాయించిన భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ పట్ల అనంత్ గీతే మొదట కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత కొంత మెత్తబడిన గీతే పదవి బాధ్యతలను చేపట్టారు. మంగళవారం పరిశ్రమల శాఖ పట్ల అసంతృప్తిగా అనంత్ గీతేను కలిసిన ఉద్ధవ్ థాక్రే ఈ విషయంపై చర్చించారు. ఈ నేపథ్యంలో శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే నరేంద్ర మోడీని బుధవారం కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

కేంద్రమంత్రివర్గంలో తమకు కనీసం ఐదు మంత్రి పదవులు వస్తాయని శివసేన ఆశించినట్లు తెలిసింది. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో తమ భాగస్వామ్యాన్ని పెంచాలని నరేంద్ర మోడీని ఉద్ధవ్ థాక్రే కోరే అవకాశం ఉంది. తమ పార్టీకి చెందిన ఎంపీలకు మరికొన్ని కేంద్రమంత్రి పదవులు అడిగే అవకాశం ఉంది.
కాగా, మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తామని బిజెపి అధిష్టానం తమకు తెలిపిందని శివసేన ఎంపి అనీల్ దేశాయి చెప్పారు. ఈ నేపథ్యంలోనే అనంత్ గీతే కేంద్రమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications