శరద్, ఉద్ధవ్, సోనియాల సారథ్యమే శిరోధార్యం: ఎమ్మెల్యేల ప్రతిజ్ఞ
ముంబై: శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ శాసన సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, సోనియాగాంధీల సారథ్యమే తమకు శిరోధార్యమని స్పష్టం చేశారు. ఆ ముగ్గురు సీనియర్ నాయకుల నేతృత్వంలో తాము సంకీర్ణ కూటమిలో కొనసాగుతామని ప్రతిన పూనారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తాము పార్టీ నిర్ణయాలను గానీ, నిబంధనలను గానీ ఉల్లంఘించబోమని అన్నారు. పార్టీ అధినేతల ఆదేశానుసారమే నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల శాసన పరేడ్
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల శాసన సభ్యుల పరేడ్ లో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ లో ఈ మూడు పార్టీల శాసన సభ్యుల పరేడ్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి ఆయా పార్టీల సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పరేడ్ లో భాగంగా- శాసన సభ్యులు ప్రమాణ వచనాన్ని చదవి వినిపించారు. ప్రతిజ్ఞ చేశారు.
ప్రత్యర్థులకు లబ్దిని కలిగించేలా
భారతీయ జనతా పార్టీకి గానీ, తమ రాజకీయ ప్రత్యర్థులకు గానీ లబ్దిని కలిగించేలా తాము ఎట్టి పరిస్థితుల్లో వ్యవహరించబోమని ఎమ్మెల్యేలు అన్నారు. వారంతా మూకుమ్మడిగా ప్రతిజ్ఞ చేశారు. సమావేశానికి ముందే వారి చేతుల్లో ప్రతిజ్ఞా పత్రాలను పెట్టారు. సమావేశం ముగింపు సందర్భంగా మూకుమ్మడిగా చదివి వినిపించారు. కాంగ్రెస్ శాసన సభ్యులు సోనియాగాంధీ పేరును, శివసేన ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాకరే పేరును, ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్ పవార్ పేరును పలికారు.
తమ తమ పార్టీ అధి నాయకుల సూచనల మేరకు
తమ తమ పార్టీ అధి నాయకుల సూచనల మేరకు నడుచుకుంటామని, పార్టీ నియమ, నిబంధనలను ఉల్లంఘించబోమని అన్నారు. ప్రత్యేకించి- బీజేపీ సహా ఏ ఇతర రాజకీయయ ప్రత్యర్థులకు లబ్ది కలిగించేలా తాము వ్యవహరించబోమని ప్రతిజ్ఞ చేశారు. శరద్ పవార్, ఉద్దవ్ థాకరే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే వారితో ప్రతిజ్ఞ చేయించారు. తమ పార్టీల గుర్తులపై మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన శాసన సభ్యులందరూ ఈ పరేడ్ లో పాల్గొన్నారని శరద్ పవార్ చెప్పారు.












Click it and Unblock the Notifications