పాక్ నటులపై అంత ప్రేమా, సల్మాన్! పాకిస్తాన్ వెళ్లిపో : శివసేన
ముంబై : సరైన వీసాతో భారత్ లో అడుగుపెట్టే పాక్ నటీ నటులకు మద్దతు పలుకుతామంటూ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అంతకుముందు.. పాక్ నటీ నటులు భారత్ లో కనిపిస్తే.. దాడులు చేస్తామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ప్రకటించిన సంగతి తెలిసిందే.
పాక్ నటులకు అనుకూలంగా సల్మాన్ వ్యాఖ్యలు చేయడం పట్ల తాజాగా శివసేన నాయకురాలు మనీషా కాయండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్ నటుల మీద అంత ప్రేమ ఉంటే.. సల్మాన్ పాకిస్తాన్ కు వెళ్లిపోవాలని ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో సల్మాన్ కు పాఠం నేర్పించాల్సిన అవసరముందన్నారు.
కాగా, పాక్ నటులను సమర్థిస్తూ వాళ్లేమి ఉగ్రవాదులు కాదని, వర్క్ పర్మిట్ వీసా తీసుకున్నాకే ఇండియా వచ్చారని, వాళ్లకు వీసా జారి చేసింది కూడా ఇండియానే అని సల్మాన్ శుక్రవారం నాడు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై స్పందించిన ఎంఎన్ఎస్ అగ్రనేత అమె ఖోప్కర్ సల్మాన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
పాక్ నటుల్లో ఒక్కరు కూడా వర్క్ పర్మిట్ వీసా తీసుకోలేదని, టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి సినిమాల్లో నటిస్తున్నారని అన్నారు. చట్ట వ్యతిరేకమైన ఈ చర్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రస్తుతం పాక్ నటులు ఇండియాలో కనిపిస్తే దాడులు తప్పవని, ఆ సినిమా నిర్మాణాలను సైతం అడ్డుకుంటామని అమే ఖోపర్ పేర్కొన్నారు.