ప్రభుత్వ ఏర్పాటు దిశగా: గవర్నర్ తో భేటీ కానున్న శివసేన: ఛాన్స్ ఇస్తారా?
ముంబై: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా శివసేన తొలి అడుగులు వేసింది. కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కూటమి సహకారాంతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇదివరకే సానుకూల సంకేతాలను ఇచ్చిన శివసేన.. ఇక ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కలవబోతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత శివసేన గవర్నర్ ను కలుసుకోబోతుండటం ఇదే తొలిసారి. భారతీయ జనతాపార్టీ రహిత కూటమి సహకారంతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఇదివరకే పలుమార్లు సూచనప్రాయంగా వెల్లడించింది శివసేన. ఈ సారి ఏకంగా కార్యాచరణలోకి దిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరబోతున్నారు ఆ పార్టీ నాయకులు.
170 మంది ఎమ్మెల్యేలు మా వెంటే: ఇక మాటల్లేవ్.. రాష్ట్రపతి పాలన పెట్టమనండి చూద్దాం: శివసేన సవాల్
170 మంది ఎమ్మెల్యేల సంతకాలతో వినతిపత్రం..
శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ సహా ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు సోమవారం సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి, ప్రభుత్వ ఏర్పాటులో చోటు చేసుకున్న ప్రతిష్ఠంభన గురించి గవర్నర్ కు వివరించనున్నారు. అనంతరం- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. తమకు 170 మంది శాసన సభ్యుల బలం ఉందంటూ సంజయ్ రౌత్ ప్రకటించిన నేపథ్యంలో.. వారి సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని కూడా ఆయన గవర్నర్ కు అందజేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి ఛాన్స్?
మహారాష్ట్రలో అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. అధికారాన్ని అందుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ.. ఈ నాలుగింట్లో ఏ ఒక్క పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేదు. బీజేపీ-శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగాయి. బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఉంది. బీజేపీ-105, శివసేన-56 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ రెండూ కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభమే. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ బలహీన పడిందని నిర్దారించుకున్న శివసేన.. 50-50 ఫార్ములాను తెర మీదికి తీసుకొచ్చింది.
సీఎం కుర్చీని పంచుకోవాలంటూ..
ముఖ్యమంత్రి పదవిని చెరీ రెండున్నరేళ్ల పాటు పంచుకోవాలనే ప్రతిపాదనను బీజేపీ ముందు ఉంచింది. దీన్ని బీజేపీ అంగీకరించ లేదు. అయిదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు కూడా. దీనితో బీజేపీతో తెగదెంపులు చేసుకునే దాకా వెళ్లింది శివసేన. కాంగ్రెస్-44, ఎన్సీపీ-54 లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ రెండు పార్టీలు అంగీకరిస్తే ఆ కూటమిలో చేరిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది శివసేన వ్యూహం. ప్రస్తుతం ఆ దిశగా మహారాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయి.
వైఖరి మార్చుకున్న ఎన్సీపీ..
ప్రస్తుతం కాంగ్రెస్ కు 44, దాని మిత్రపక్షం ఎన్సీపీకి 54 స్థానాలు ఉన్నాయి. 56 సీట్లు ఉన్న శివసేన ఈ రెండు పార్టీలతో కలిస్తే మొత్తం బలం 154కు చేరుతుంది. దీనితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. శివసేనకు ముఖ్యమంత్రిని వదులుకోవడానికి కాంగ్రెస్, ఎన్సీపీలు సిద్ధంగా ఉన్నాయి. శివసేనతో చేతులు కలపడానికి మొదట తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది ఎన్సీపీ. క్రమంగా తన వైఖరిని మార్చుకుంది. భారతీయ జనతాపార్టీకి అధికారాన్ని దూరం చేయడానికి శివసేనతో చేతులు కలపడానికి సిద్ధపడినట్ు తెలుస్తోంది. ఈ కారణం వల్లే శివసేన తమకు 170 మంది సభ్యుల బలం ఉందని స్పష్టం చేసినట్లు సమాచారం.