మోడీ జోలికొస్తే ఊరుకోం: తాలిబన్కు శివసేన హెచ్చరిక
మోడీని లక్ష్యంగా పెట్టుకున్న పాకిస్థాన్ తాలిబన్ ఉగ్రవాదులను హెచ్చరిస్తూనే, తమ ప్రధానమంత్రిని ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. ప్రధాని మోడీ ఆదివారం విస్తరించనున్న తన మంత్రివర్గంలో చేర్చుకోవడానికి శివసేన నుంచి ఇద్దరి పేర్లు సూచించాల్సిందిగా పిఎంఓ నుంచి గురువారం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు ఫోన్ వచ్చింది.
ఇది జరిగిన మరుసటి రోజు సంచిక సామ్నా సంపాదకీయంలోనే మోడీకి శివసేన అండగా నిలబడటం విశేషం. ‘హిందుత్వకు గట్టి మద్దతదారు అయినందున ప్రధాని మోడీని తాలిబన్లు తమ హిట్లిస్టులో చేర్చారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గంగానదికి హారతి ఇవ్వడం ద్వారా ఆయన తన హిందుత్వ వైఖరిని ప్రదర్శించారు' అని శివసేన పేర్కొంది.
ప్రధానమంత్రి ముస్లింలకు వ్యతిరేకం కాదని, అయితే ముస్లింలను ప్రత్యేకంగా చూడటానికి వ్యతిరేకమని తెలిపింది. గత వారం వాఘా సరిహద్దులో జరిగిన ఆత్మాహుతి దాడిని మోడీ ఖండించారు. ఆ తరువాత ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ మోడీని హెచ్చరించింది.
గుజరాత్, కాశ్మీర్లలో అమాయక ముస్లింల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఒకవైపు, తాలిబన్ ఉగ్రవాదులు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్లలో అనేక మంది ముస్లింలను హతమారుస్తూ, మరోవైపు భారత్లో జరిగిన ముస్లింల హత్యలను ఖండించడం విడ్డూరంగా ఉందని శివసేన విమర్శించింది.