ఇప్పుడు జెండా రంగు ఎందుకు మార్చారు...రాజ్థాక్రేపై నిప్పులు చెరిగిన శివసేన
ముంబై: ఓ వైపు కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచేయాలని సూచిస్తూనే మరోవైపు భారత్లో అక్రమంగా ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు చెందిన ముస్లింలను తరిమివేయాలని శివసేన మాతృపత్రిక సామ్నాలో కథనం ప్రచురితమైంది. ఇక ఇదే సమయంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్థాక్రేను కూడా లక్ష్యంగా చేసుకుని శివసేన పార్టీ సామ్నా ద్వారా విరుచుకుపడింది.

జెండా రంగును మార్చిన రాజ్థాక్రే పార్టీ
రాజ్థాక్రే పార్టీకి చెందిన పార్టీ జెండాను కాషాయంలోకి మార్చడంపై మండిపడింది శివసేన. బీజేపీతో కలిసేందుకే రాజ్థాక్రే పార్టీ జెండాను కాషాయం రంగులోకి మార్చిందని మండిపడింది. అంతేకాదు తమ ప్రాథమిక అజెండా కూడా హిందూత్వమే అని చాటుకునేందుకు రాజ్థాక్రే తన పార్టీ జెండా రంగును మార్చారని దుయ్యబట్టింది. 14 ఏళ్ల క్రితం మరాఠీ భావజాలంతో రాజ్థాక్రే పార్టీని స్థాపించారని ఇప్పుడు హఠాత్తుగా పార్టీ జెండా రంగును మార్చేసి హిందుత్వ పార్టీగా చెప్పుకునేందుకు తయారయ్యారని మండిపడింది. రాజ్థాక్రే తన ప్రసంగంలో కూడా హిందూ సోదరీసోదరులకు స్వాగతం అని చెప్పి బీజేపీ స్క్రిప్ట్ను చదివారని శివసేన ధ్వజమెత్తింది. అయినప్పటికీ ఆ పార్టీకి ఒరిగేది ఏమీ లేదని... భవిష్యత్తులో కూడా ఏమీ ఒరగదని శివసేన ఘాటుగా స్పందించింది.

ఓట్ల కోసమే రాజ్థాక్రే హిందూత్వ అజెండా
కొన్ని వారాల క్రితం రాజ్థాక్రే సీఏఏకు వ్యతిరేకంగా ఉన్నారని ఇప్పుడు కేవలం ఓట్ల కోసమే తన పార్టీ జెండా రంగును మార్చారని శివసేన పార్టీ ధ్వజమెత్తింది. రాజ్థాక్రే పార్టీ ద్వారా బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందని చెప్పిన శివసేన పార్టీ.. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ముస్లిం సామాజిక వర్గంవారే కాకుండా 30 నుంచి 40శాతం హిందువులపై కూడా ప్రభావం చూపుతోందని శివసేన ఆరోపించింది. ఈ చట్టం ద్వారా ఆర్మీలో పనిచేసిన జవాన్లు, మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులు కూడా ఈ జాబితా నుంచి తొలగించబడుతారని శివసేన చెప్పుకొచ్చింది.

ఫిబ్రవరి 9న సీఏఏకు ఎన్ఆర్సీలకు మద్దతుగా రాజ్థాక్రే ర్యాలీ
ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతుగా ఫిబ్రవరి 9న ముంబైలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీని నిర్వహిస్తామని రాజ్థాక్రే చెప్పారు. సీఏఏ ఎన్ఆర్సీలను వ్యతిరేకించే వారికోసమే ఈ ర్యాలీ తీస్తున్నట్లు చెప్పారు. గత డిసెంబర్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్కు వలస వచ్చి నివసిస్తున్నవారిని మతంతో సంబంధం లేకుండా దేశం నుంచి తరిమివేయాలని అన్నారు. అంతేకాదు ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారకి ఆశ్రయం కల్పించి వారి బాగోగులను చూసుకోవాలంటే దేశానికి అదనపు భారమని చెప్పిన రాజ్థాక్రే... సొంత దేశ ప్రజలకే కావాల్సిన అవసరాలు ఏర్పాటు చేయలేకపోతున్నామని నాడు చెప్పారు.

ఐదేళ్లలో బీజేపీ చేయలేనిది 50 రోజుల్లో శివసేన చేసింది
ఇక అభివృద్ధిపై మాట్లాడిన శివసేన పార్టీ బీజేపీ ఐదేళ్లలో చేయని అభివృద్ధిని మహావికాస్ అగాఢీ ప్రభుత్వం 50 రోజుల్లో చేసిందని పేర్కొంది. జమ్ము కశ్మీర్లో మెహబూబా ముఫ్తీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్పుకాదని... అదే కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కలయికను జీర్ణించుకోలేకున్నారని శివసేన బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. కామన్ మినిమమ్ ప్రోగ్రాంను అమలు చేస్తూ మహారాష్ట్రను ముందుకు తీసుకెళ్లేందుకే ప్రభుత్వంలోకి వచ్చినట్లు శివసేన పేర్కొంది.












Click it and Unblock the Notifications