హర్యానాలో బీజేపీకి షాక్: ఓటమి అంచున ఏడుగురు కేబినెట్ మంత్రులు
హర్యానా: బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హర్యానా రాష్ట్రంలో ఆ పార్టీకి చేదు అనుభవమే మిగిలింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన సమయంలో దూసుకెళుతున్నట్లు కనిపించిన బీజేపీ ఆ తర్వాత సమయం గడిచేకొద్దీ స్పీడు తగ్గింది. కాంగ్రెస్, జేజేపీ, ఇండిపెండెంట్లు పుంజుకోవడంతో హర్యానాలో బీజేపీకి షాక్ తగిలింది. మ్యాజిక్ ఫిగర్ కూడా అందుకోవడం కష్టంగానే ఉంది. ఇక హర్యానాలో దాదాపు 7 మంది కేబినెట్ మంత్రులు ఓటమి అంచున ఉన్నారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా ఓటమి అంచున ఉండటం, బీజేపీ మెరుగైన ప్రదర్శన కనబర్చకపోవడంతో భాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఇక అసెంబ్లీ స్పీకర్ కూడా భారీగా వెనకబడి ఉన్నారు. బీజేపీ 40 స్థానాల్లో ముందంజలో ఉండగా కాంగ్రెస్ 35 సీట్ల లీడ్ను మెయింటెయిన్ చేస్తోంది. ఇక ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన జేజేపీ మరో 9 స్థానాల్లో ముందంజలో ఉంది. రెండు జాతీయ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో జేజేపీ ఇతర ఇండిపెండెంట్లు కీలకంగా మారారు.
ఈ క్రమంలోనే జేజేపీ ఇతర ఇండిపెండెంట్లు కాంగ్రెస్కు మద్దతు తెలపి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా కోరారు. వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో విపక్షాలు అన్నీ చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక కర్నాల్లో సీఎం మనోహర్లాల్ ఖట్టర్, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్లు తప్ప మిగతా కేబినెట్ మంత్రులంతా వెనుకంజలో ఉన్నారు.
బీజేపీ మంత్రులతో పాటు టిక్టాక్ స్టార్ సోనాలీ ఫోగట్ కూడా వెనుకంజలో ఉంది. ఈమె పూర్తిగా మోడీ చరిష్మాపైనే ఆధారపడింది. ఇదిలా ఉంటే బీజేపీ పేలవ ప్రదర్శనపై వివరణ ఇవ్వాల్సిందిగా బీజేపీ చీఫ్ అమిత్ షా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ను ఢిల్లీకి రావాల్సిందిగా కబురు పంపారు. ఢిల్లీకి వెళ్లిన ఖట్టర్ అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో తిరిగి బీజేపీ అధికారం చేపడుతుందని ఫరీదాబాద్ ఎంపీ కృష్ణపాల్ ధీమా వ్యక్తం చేశారు. ఇక జేజేపీ నేత దుశ్యంత్ చౌతాలా 2014లో బీజేపీ అభ్యర్థి ప్రేమ్లతా చేతిలో ఓటమిపాలయ్యారు. కానీ ఈసారి మాత్రం గెలుపు దిశగా పయనిస్తున్నారు.