సజీవ దహనం చేస్తాం: ఆప్ నేతకు బెదిరింపులు
న్యూఢిల్లీ: తనను సజీవదహనం చేస్తామంటూ బెదిరింపు లేఖలు వచ్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోనీ సోరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనని మావోయిస్టుగా పేర్కొంటూ బీజాపూర్లో కాలుపెడితే సజీవదహనం చేస్తామని బెదిరించినట్లు సోనీ దంతేవాడలోని గీదమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బస్తర్ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న ఘటనలను వెలుగులోకి తీసుకురావడంలో సోనీసోరి ముందుంటారు. మావోయిస్టు ప్రాంతాలైన బీజాపూర్, సుక్మాల్లో గిరిజన మహిళలపై కూంబింగ్ పేరుతో భద్రతా సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో ఇటీవల సోనీ సూరి ఈ ప్రాంతాలని సందర్శించారు.
భద్రతా సిబ్బందైనా మావోయిస్టులైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఓ ప్రజానేతగా వీటిని వెలుగులోకి తీసుకురావడం తన బాధ్యతని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల బీజాపూర్, సుకుమా ప్రాంతాల్లో పర్యటించిన సోనీ సోరీ.. భద్రతా దళాలు మావోయిస్టుల పేరుతో సామాన్య ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారెవరైనా(మావోస్టులైనా, పోలీసులైనా) చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.