నాకు లోన్ ఇవ్వకుంటే బ్యాంక్ పేల్చేస్తా.. బ్యాంక్ మేనేజర్ కు షాకింగ్ కాల్!!
బ్యాంకు లోను కావాలని బ్యాంకుల చుట్టూ తిరిగే వారిని చూశాం. బ్యాంకు అధికారులను ప్రాధేయ పడేవాడిని, లోన్ కోసం పడరాని పాట్లు పడే వారిని చూశాం. లోన్ కోసం అడ్డదారుల్లో తిప్పలు పడే వారిని కూడా చూసి ఉంటాం. కానీ బ్యాంకు లోను కోసం ఏకంగా బ్యాంక్ మేనేజర్ కి ఫోన్ చేసి బెదిరించే వారిని ఎక్కడ చూసి ఉండం. ఇక అటువంటి ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.
లోన్ ఇవ్వకుంటే బ్యాంకు పేల్చేస్తా.. ఎస్బీఐ శాఖకు కాల్
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తనకు పది లక్షల రూపాయల బ్యాంకు లోన్ మంజూరు చేయాలని, లేదంటే బ్యాంకును పేల్చేస్తా అని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎస్బిఐ శాఖకు కాల్ చేశారు. ఎస్బిఐ చైర్మన్ దినేష్ ఖారాను కిడ్నాప్ చేసి హత్య మారుస్తామని ఫోన్ లో బెదిరించారు. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బ్యాంకులోన్ ఇవ్వకపోతే ఎస్బిఐ చైర్మన్ దినేష్ ఖారాను హతమారుస్తామని బెదిరించడంపై ఆందోళన చెందిన బ్యాంకు మేనేజర్ పై ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసిన బ్యాంకు మేనేజర్
ముంబై నారీమన్ పాయింట్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు సెక్యూరిటీ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తు తెలియని ఆగంతకులు ఫోన్ కాల్ బెదిరింపు నేపథ్యంలో కేసు నమోదు చేశారు. అయితే ఈ ఫోన్ కాల్ పశ్చిమ బెంగాల్ నుంచి రావడంతో, నిందితుడి కోసం ఒకటి టీమ్ ను పశ్చిమ బెంగాల్ కు పంపించారు పోలీసులు. అతడు ఫోన్ చేసిన ప్రాంతాన్ని టెక్నాలజీతో గుర్తించి అతడిని పట్టుకోవటం కోసం ఒక బృందాన్ని అక్కడకు పంపించారు.
పశ్చిమ బెంగాల్ లో నిందితుడు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అసలు నిందితుడు ఎవరు? ఎందుకు ఈ విధంగా బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు? నిజంగా అతను లోన్ కోసమే ఫోన్ చేశాడా? వంటి అనేక అంశాలపై పోలీసులు దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్నారు. అతనికి ఏమైనా మతి స్థిమితం లేదా అన్న కోణంలోనూ చర్చ జరుగుతుంది. మొత్తానికి బ్యాంక్ లోన్ ఇవ్వకుంటే బ్యాంక్ పేల్చేస్తా అంటూ బ్యాంక్ అధికారులకే ఫోన్ చెయ్యటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్ లో సదరు నిందితుడిని పట్టుకుంటే అసలు విషయం బయటకు వస్తుందని భావిస్తున్నారు.