సుష్మాస్వరాజ్ కన్నడ స్పీచ్ : సుష్మాస్వరాజ్ 'కన్నడిగా' నా?
Recommended Video
సుష్మాస్వరాజ్ పరిచయం అక్కర్లేని పేరు ! భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతలలో అగ్రగణ్యురాలైన సుష్మాస్వరాజ్ హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు అన్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి గా 100 కు 200 శాతం న్యాయం చేస్తూ సుష్మాస్వరాజ్ భాద్యతలు నిర్వహిస్తున్నారు.
అయితే సుష్మాస్వరాజ్ హిందీ పరిజ్ఞానం గురించి మన అందరకీ తెలుసు. రాజకీయంగాను, రాజకీయేతరం గాను సుష్మాస్వరాజ్ ఎంత గొప్ప వక్తో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1970లలోనే విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు.
ఇక ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించడానికి 1998 అక్టోబర్లో సుష్మాస్వరాజ్ను భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేంద్రమంత్రిమండలి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాడానికి పంపించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా సుష్మాస్వరాజ్ రికార్డు సృష్టించిననూ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పరాజయం పొందుటతో డిసెంబర్లో మళ్ళీ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశీంచారు. కాగా 1999లో జరిగిన లోక్సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున బలమైన మహిళా నాయకురాలి గా సుష్మాస్వరాజ్ను బరిలోకి దించారు. అయితే ఊహించినట్లుగానే సుష్మాస్వరాజ్ ఓడిపోయినా సోనియాపై పోటీచేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు.
ఇక 1999లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో తీసిన ఒక వీడియోను సుష్మాస్వరాజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఇక అందులో సుష్మాస్వరాజ్ అనర్గళంగా కన్నడ లో మాట్లాడుతున్నారు. ఎప్పుడూ హిందీ పలుకులు వినే వాళ్ళకు సుష్మాస్వరాజ్ కన్నడ స్పీచ్ ఆమె మీద మరింత గౌరవాన్ని తెచ్చిందనే చెప్పాలి. ఇక అందులో మన చంద్రబాబు ఉండటం మరో గమనించాల్సిన అంశం. అయితే సుష్మాస్వరాజ్ ఇప్పటికిప్పుడు ఆ వీడియోను షేర్ చెయ్యడానికి ఒక బలమైన కారణం ఉంది.
అదేంటంటే నిన్న లోక్ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్, సుష్మా స్వరాజ్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా గుర్తించాలన్న సుష్మా ప్రతిపాదనపై థరూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. హిందీ మన జాతీయ భాష కాదు. అధికార భాష మాత్రమే. అసలు ఐరాసలో మనం అధికార భాషను కలిగి ఉండాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు.
ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి హిందీలో అక్కడ ప్రసంగిస్తే దాన్ని ఐక్యరాజ్య సమితిలో అధికార భాషగా గుర్తించాలా ప్రధాని తమిళ వ్యక్తి అయితే.. తమిళ్ మాట్లాడితే.. ఆ భాషను ఐరాసలో అధికార భాష చేయాలని ప్రతిపాదిస్తారా? అంటూ థరూర్ మండిపడ్డారు. ఇక తనకు హిందీ మాత్రమే కాదు, ఇంకా కొన్ని భాషలు కూడా వచ్చు అని చెప్పకనే చెప్పారు సుష్మా.