బలపరీక్షలో ట్విస్ట్: మా ఎమ్మెల్యే కిడ్నాప్ అయ్యారంటూ ఫిర్యాదు: ఆ సంగతి తేల్చండన్న స్పీకర్
బెంగళూరు: కర్ణాటక శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొంటోన్న ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి ప్రభుత్వం.. చివరి నిమిషంలో అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చింది. బుధవారం రాత్రి నుంచీ కనిపించకుండా పోయిన తమ ఎమ్మెల్యే శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ కిడ్నాప్ అయ్యారని, దీని వెనుక భారతీయ జనతాపార్టీ నాయకుల హస్తం ఉందని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పీకర్ రమేష్కుమార్కు లిఖితపూరక ఫిర్యాదును అందజేశారు. దీనితో- ముందు ఈ విషయాన్ని తేల్చాలంటూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారు.

బుధవారం రాత్రి నుంచీ కనిపించని శ్రీమంత్..
బెంగళూరు శివార్లలో దేవనహళ్లిలోని విండ్ఫ్లవర్ ప్రకృతి రిసార్ట్స్ నుంచి బుధవారం రాత్రి మాయమైన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్.. తెల్లారేసరికి ముంబైలో తేలారు. గుండెనొప్పితో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను కుటుంబ సభ్యులు విడుదల చేశారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో- ఆయన సభకు గైర్హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతీయ జనతాపార్టీ నేతల ప్రోద్బలం వల్లే ఆయన బలపరీక్షకు అందుబాటులో లేకుండాపోయారని కర్ణాటక పీసీసీ నాయకులు ఆరోపిస్తున్నారు.

కిడ్నాప్ చేశారంటోన్న కాంగ్రెస్..
ఇదే విషయాన్ని కాంగ్రెస్ సభ్యుడు దినేష్ గుండూరావు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ సైతం సభలో ప్రస్తావించారు. శ్రీమంత్ పాటిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలను ఆయన సభలో ప్రదర్శించారు. తనతో పాటు దేవనహళ్లిలోని ప్రకృతి రిసార్ట్స్లో ఉన్న శ్రీమంత్ పాటిల్ను బీజేపీ నాయకులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని డీకే శివకుమార్ ఆరోపించారు. తమ ఎమ్మెల్యేను బీజేపీ నాయకులు మొదట చెన్నైకి తీసుకెళ్లారని, అనంతరం అక్కడి నుంచి ముంబైకి తరలించారని చెప్పారు. ఆయనను బలవంతంగా ముంబై ఆసుపత్రిలో చేర్చారని ఆరోపించారు. తన తండ్రిని కిడ్నాప్ చేశారని శ్రీమంత్ పాటిల్ పిల్లలు తన దృష్టికి తీసుకొచ్చారని డీకేశి చెప్పారు. ఎనిమిదిమంది ఎమ్మెల్యేలతో కలిసి ఉన్న ఆయన.. రాత్రికి రాత్రి అదృశ్యం అయ్యారని, తెల్లారేసరికి ముంబై ఆసుపత్రిలో స్ట్రెచర్పై కనిపించారని అన్నారు.

ఆరా తీయాలంటూ స్పీకర్ ఆదేశం..
దీనిపై స్పీకర్ రమేష్కుమార్ స్పందించారు. కగ్వాడ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న కాంగ్రెస్ సభ్యుడు శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ కిడ్నాప్కు గురయ్యారని అధికారికంగా తనకు ఫిర్యాదు అందిందని స్పీకర్ వెల్లడించారు. మొదట- దీనిపై విచారణ జరిపించాలని ఆయన హోమ్ శాఖ మంత్రిని ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను అందజేయాలని సూచించారు. శ్రీమంత్ పాటిల్ ఎక్కడికెళ్లారు? ఎలా ఉన్నారు? బలపరీక్ష ఉన్న సమయంలో ఆయన ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనే అంశాలపై ఆరా తీయాలని చెప్పారు. నిజంగా చికిత్స కోసమే వెళ్లారా? లేక ఉద్దేశపూరక కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది తేల్చాలని అన్నారు.

ఇదే చివరి ట్విస్ట్ అయ్యేనా?
మరి కొన్ని గంటల్లో శాసనసభలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోనున్న నేపథ్యంలో- కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే ఒకరు అదృశ్యం అయ్యారు. ఆయన పేరు శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్. కగ్వాడ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళికి అత్యంత ఆప్తుడు. బుధవారం రాత్రి నుంచి ఆయన కనిపించట్లేదంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది. బెంగళూరు శివార్లలో దేవనహళ్లిలోని ప్రకృతి రిసార్ట్స్ నుంచి రాత్రి 8 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఆయన కారులో వెళ్లిపోయారని పీసీసీ నాయకులు తెలిపారు. ఆయన సెల్ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని పేర్కొన్నారు. దీనిపై వారు దేవనహళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications