Femina Miss India 2022: విజేతగా ఛార్టెడ్ అకౌంటెన్సీ స్టూడెంట్: 4వ స్థానంలో మిస్ తెలంగాణ
ముంబై: ఫెమినా మిస్ ఇండియా 2022 విజేతగా సినీ షెట్టి ఎంపిక అయ్యారు. ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి ఏర్పాటైన గ్రాండ్ ఫైనల్స్లో ఆమెను విజేతగా ప్రకటించారు నిర్వాహకులు. రాజస్థాన్కు చెందిన రూబల్ షెకావత్ రెండో రన్నరప్గా నిలిచారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన సినట చౌహాన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. మిస్ ఇండియా తెలంగాణ ప్రజ్ఞా అయ్యగారి నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. గార్గీ నందీ అయిదో స్థానంలో నిలిచారు.
సినీ షెట్టి స్వరాష్ట్రం కర్ణాటక. ముంబైలోనే పుట్టి పెరిగారు. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఛార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్స్ చేస్తోన్నారు. భరతనాట్య కళాకారిణి కూడా. ఇదివరకు ఈ టైటిల్ను సాధించిన లారా దత్తా, సారా జేన్ డయాస్, సంధ్యా ఛిబ్, నఫీసా జోసెఫ్, రేఖ హండె, లిమారైనా డిసౌజా కర్ణాటకకు చెందినవారే. ఇప్పుడిదే జాబితాలో సినీ షెట్టి చేరారు.
బాలీవుడ్ నటులు నేహా ధుపియా, కృతి సనన్, మనీష్ పాల్, రాజ్ కుమార్ రావ్, డినో మోరియా, మాజీ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్, మలైక అరోరా, డిజైనర్ రోహిత్ గాంధీ, కోరియోగ్రాఫర్ షియామక్ దావర్తో కూడిన ప్యానెల్.. విజేత పేరును ప్రకటించింది. ఈ కార్యక్రమానికి పరిమితంగా సెలెబ్రిటీలు హాజరయ్యారు. బాలీవుడ్ సెలెబ్రిటీస్ రాకతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యానికి చెందిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ కళకళలాడింది.
చివరి రౌండ్లో సమకాలిన పరిస్థితులు, సామాజిక అంశాలు, మహిళల సంక్షేమం.. వంటి విషయాలపై జ్యూరీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాలు కీలకం అయ్యాయి. దీని ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. సీనీ షెట్టి ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా ఉండటంతో ఆమెను విజేతగా ప్రకటించారు జ్యూరీ సభ్యులు.
తొలి రన్నరప్ రూబల్ షెకావత్ యాక్టింగ్ స్టూడెంట్. థియేటర్ ఆర్టిస్ట్గా స్థిరపడాలనేది ఆమె కోరిక. బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. ఇదివరకు జిల్లా స్థాయి టోర్నమెంట్లల్లో ఆమె పాల్గొన్నారు. రెండో రన్నరప్ షినట చౌహాన్.. ఇదివరకు మిస్ ఉత్తర ప్రదేశ్ టైటిల్ను గెలిచారు. ఢిల్లీలోని కేంబ్రిడ్జ్ స్కూల్, ఢిల్లీ యూనివర్శటీ పరిధిలోని గార్గీ కాలేజీ పూర్వ విద్యార్థిని. స్కూల్ టాపర్. మిస్ ఇండియా తెలంగాణ ప్రజ్ఞా అయ్యగారి.. టాప్-3లో నిలవలేకపోయారు. నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు.