సిసోడియా డిప్యూటీ సిఎం: కేజ్రీవాల్ హామీలు సవాలే?
న్యూఢిల్లీ: ఎఎపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడిన నేపథ్యంలో కేబినెట్ బెర్తుల పైన ఊహాగానాలు వస్తున్నాయి. పార్టీ మరో ముఖ్య నేత మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. సిసోడియాకు ఉప ముఖ్యమంత్రి పదవే ఇస్తే ఢిల్లీ చరిత్రలో సిసోడియా తొలిసారి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించిన వారవుతారు. అన్నా హజారే జన్ లోక్పాల్ బిల్లు ఉద్యమంలో కేజ్రీవాల్తో పాటు సిసోడియా కూడా ఉన్నారు. మరో నేత వినోద్ కుమార్ బిన్ని, సౌరభ్ భరద్వాజ్ తదితరులకు కూడా కేబినెట్లో చోటు దక్కనుందంటున్నారు.
హామీల అమలు సవాల్
కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు అతి పెద్ద సవాల్ అంటున్నారు. తాము ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, 18 ముఖ్యమైన అంశాలు, మా మ్యానిఫెస్టోలోని హామీలపై విశ్వాసం కోరతామని, మద్దతు ఇవ్వాలనుకునే ఎమ్మెల్యేలు ఇస్తారని, ఒకవేళ ప్రభుత్వం పడిపోతే మళ్లీ ఎన్నికలు వస్తాయని, తాము దానికి సిద్ధపడే ఉన్నామని ఎఎపి నేతలు చెబుతున్నారు. విద్యుత్తు, నీరు, జన్లోక్పాల్కు ప్రాధాన్యం ఇస్తామన్నారు.

ఎన్నికల ప్రణాళికలో ఎఎపి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన హామీలు, అందులో ఇబ్బందులు. అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో ఢిల్లీ జన్లోక్పాల్ బిల్లును ఆమోదిస్తామని, లోక్పాల్ పరిధిలోకి ఢిల్లీ ప్రభుత్వంలోని అధికారులు, ఉద్యోగులు, ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రజా ప్రతినిధులు వస్తారని చెప్పారు. ఈ హామీ అమలు కావాలంటే కాంగ్రెస్, బిజెపిల మద్దతు తప్పదు.
విద్యుత్తు బిల్లులు యాభై శాతం తగ్గిస్తామని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వానికి సొంతంగా విద్యుదుత్పత్తి లేదు. బయటి నుంచి కొనుగోలు చేయాల్సిందే. చార్జీలు 50 శాతం తగ్గిస్తే ఢిల్లీలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ కుప్పకూలిపోవచ్చు. పైగా విద్యుత్తు చార్జీలు ఎంత ఉండాలనేది ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ నిర్ణయిస్తుంది. చార్జీలను 50 శాతం తగ్గిస్తే ఆ మేరకు ప్రభుత్వం సబ్సిడీని భరించాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఖజానాపై ఇది పెనుభారమే అవుతుంది.
ఢిల్లీలో ప్రతి ఇంటికి 700 లీటర్ల నీరు ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పారు. నీటి వనరులు ఎక్కడున్నాయి? ఉచితంగా ఎలా ఇస్తారు? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఢిల్లీలో కొత్తగా 500 పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. ఢిల్లీలో భూముల కేటాయింపు మొత్తం కేంద్రం చేతిలో ఉంటుంది. కేంద్రం భూములు కేటాయించకుండా స్కూళ్లు నిర్మించలేరు.
నగరంలో రెండు లక్షల కమ్యూనిటీ, పబ్లిక్ టాయ్లెట్లను నిర్మిస్తామని, వాటిలో సగం మహిళలకు ప్రత్యేకమన్నారు. అనధికారిక కాలనీలను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. ఢిల్లీలో 1639 అనధికారిక కాలనీలు ఉన్నాయి. వాటన్నింటినీ క్రమబద్ధీకరించడమంటే మాటలు కాదని అంటున్నారు.












Click it and Unblock the Notifications