బెంగాల్ హింస: ఆరుగురు బీజేపీ కార్యకర్తల హత్య, కార్యాలయాలకు నిప్పు, ఇళ్లు, దుకాణాలు ధ్వంసం
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని గంటలకే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ మరోసారి అధికారం చేపట్టనున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఫలితాలు వెలువడిన గంటల్లోనే బెంగాల్లో హింసాత్మక ఘటనలు
బెంగాల్ ఫలితాలు వెలువడిన ఆదివారం రోజునే భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన వందకుపాగా పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. అంతేగాక, ఆరుగురు బీజేపీ కార్యకర్తలు హత్య చేయబడ్డారు. టీఎంసీ మరోసారి గెలిస్తే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న తమ మాట నిజమైందని బీజేపీ నేతలు అంటున్నారు. టీఎంసీ గూండాలే తమ కార్యకర్తలను హత్య చేశారని, ఆఫీసులను తగలబెట్టారని ఆరోపించారు.
హింసాత్మక ఘటనలపై గవర్నర్ సీరియస్
కాగా, కొందరు దుండగులు కర్రలు, రాడ్లు పట్టుకుని పలు ప్రాంతాల్లోని బీజేపీ కార్యకర్తల ఇళ్లల్లోకి వెళ్లి దాడులకు పాల్పడ్డారు. అంతేగాక, దోపిడీలకు పాల్పడ్డారు. ఈ మేరకు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ సోమవారం డీజీపీకి సమన్లు పంపారు. హింసాత్మక ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
ఆరుగురు బీజేపీ కార్యకర్తల హత్య
జగద్దల్ ప్రాంతంలో శోవ రాణి మండల్, రాణాఘాట్ లో ఉత్తమ్ ఘోష్, బెలియఘటాలో అభిజిత్ సర్కార్, సోనార్పూర్ దక్షిణ్లో హరోమ్ అధికారి, సీతాల్కుచిలో మోమిక్ మౌత్ర, బోల్పూర్ లో గౌరబ్ సర్కార్ అనే బీజేపీ కార్యకర్తలు దుండగుల దాడిలో మరణించారు. టీఎంసీ గూండాలే తమ కార్యకర్తలను హత్య చేశారని, తమ పార్టీ కార్యాలయాలను తగలబెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
Recommended Video
బీజేపీ కార్యాలయాలకు నిప్పు, కార్యకర్తలపై దాడులు
టీఎంసీ అభ్యర్తి సుజాత మండల్ ఓటమిపాలైన కొన్ని గంటల్లోనే ఆరంబాఘ్ బీజేపీ కార్యాలనాయికి టీఎంసీ గూండాలు నిప్పుపెట్టి కాల్చారని స్థానిక బీజేపీ నేత ఆరోపించారు. అయితే, బీజేపీ ఆరోపణలను టీఎంసీ తోసిపుచ్చుతోంది. నందిగ్రాంలో సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఓడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సువెందు అధికారి కారుపై, హల్దియా పోలింగ్ కేంద్రంపై టీఎంసీ గూండాలు రాళ్ల దాడి చేశారని బీజేపీ నేతలు చెప్పారు. బెలెఘటా ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలను టీఎంసీ గూండాలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని స్థానిక నాయకులు చెబుతున్నారు. టీఎంసీ మాత్రం తమకు సంబంధం లేదని అంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది.