పెగాసస్ హ్యాకింగ్తో కేంద్రానికి సంబంధం లేదు: విపక్షాల ఆరోపణలపై రవిశంకర్ ప్రసాద్ ఫైర్
న్యూఢల్లీ: పెగాసెస్ స్పైవేర్తో అధికార, విపక్ష నేతలతోపాటు ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్కు గురైనట్లు వస్తున్న వార్తలతో భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ తేల్చి చెప్పారు. హ్యాకింగ్ నివేదికలు విడుదల చేస్తోన్న సంస్థలు కూడా ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లు ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు.
కేవలం పార్లమెంటు సమావేశాలకు ఆటంకం కలిగించేందుకే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నిరాధార, రాజకీయ ఆరోపణలు చేస్తోందని రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. లీక్ అయిన డేటాబేస్లో ఫోన్ నెంబర్ ఉన్నంత మాత్రాన అది హ్యాకింగ్ గురైనట్లు కాదని, కథనాలు ప్రచురిస్తోన్న సదరు వార్తా సంస్థలే వెల్లడిస్తున్న విషయాన్ని రవిశంకర్ ప్రసాద్ ప్రస్తావించారు.
దేశ ప్రజల గోప్యత హక్కును పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ కేంద్రమంత్రి తెలిపారు. ఇక పెగాసస్ హ్యాకింగ్ కథనాలను ప్రచురిస్తోన్న సంస్థలపై రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. ఈ నివేదికలు విడుదల చేస్తోన్న అమ్నేస్టీ ఇంటర్నేషనల్ సంస్థకు భారత వ్యతిరేకి అనే ముద్ర ఉందని ఆయన గుర్తు చేశారు.
మరోవైపు, భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ కథనాలను ప్రచారం చేస్తున్నారంటూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్సభలో స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలకు ముందుగా ఇలాంటి వార్తలు రావడం కాకతాళీయం కాదని అన్నారు. ఈ వ్యవహారంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందిస్తూ.. ఇలాంటి చర్యలన్నీ పనికిరానివని అన్నారు. అయితే, పెగాసస్ వ్యవహారంలో కాంగ్రెస్, విపక్షాలు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీపై విచారణ జరపాలని, హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.