చిక్కుల్లో సొలిసిటర్ జనరల్ -BJPతో లింకులు -మోదీ భుజం మీదుగా సువేందుపై మమత తూటా -పదవి ఊడేనా?
ఆయన దేశంలోనే రెండో అత్యున్నత న్యాయ అధికారి. కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం అమలుపై సలహాలిస్తూ, కేంద్ర ప్రభుత్వం తరఫున కోర్టుల్లో వాదించడం ఆయన విధి. అటార్నీ జనరల్ (ఏజీ) దేశానికి చీఫ్ లీగల్ అడ్వైజరైతే, ఆ తర్వాతి స్థానం సొలిసిటర్ జనరల్ (ఎస్జీ)ది. అంతటి కీలక పదవిలో కొనసాగుతూ, రాజ్యాంగ, నైతిక విలువలకు విరుద్దంగా బీజేపీ నేతలతో భేటీ కావడంతో, అందునా భారీ కుంభకోణంలో నిందితుడితో సమావేశం కావడడం రచ్చకు దారితీసింది. వివరాలివి..
భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చిక్కుల్లో పడ్డారు. కేంద్ర సంస్థల తరఫున కోర్టుల్లో కీలక కేసులు వాదించే ఆయన.. శారత చిట్ ఫండ్ కుంభకోణంలో నిందితుడైన బీజేపీ నేత సువేందు అధికారితో రహస్యంగా భేటీ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తుషార్-సువేందుల భేటీ అనైతికమని, తుషార్ మెహతాను తక్షణమే సొలిసిటర్ జనరల్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. దీనిపై..

పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడైన సువేందు అధికారితో కలయికపై అధికార టీఎంసీ.. ప్రధాని మోదీకి రాసిన లేఖపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. టీఎంసీ ఎంపీలు చేసిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. ఢిల్లీలోని తన ఇల్లు కమ్ ఆఫీసుకు సువేందు అధికారి వచ్చిన మాట వాస్తవమని అంగీకరించారు. అయితే..

బీజేపీ నేత సువేందు అధికారి వచ్చిన సమయంలో తాను ముందే ఫిక్సైన వేరొక మీటింగ్ లో బిజీగా ఉన్నానని, చాలా సేపటికి మీటింగ్ అయిపోయాకగానీ సువేందు వచ్చిన విషయాన్ని పీఏ ద్వారా తెలుసుకున్నానని, చివరికి తనను కలవకుండానే సువేందు అధికారికి వెళ్లిపోయారంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరించారు. సువేందు నిందితుడిగా ఉన్న శారద్ చిట్ ఫండ్ స్కాం కేసులో సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్నది సొలిసిటర్ జనరల్ తుషారే కావడంతో వీరి భేటీని టీఎంసీ తప్పు పట్టింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయ అధికారిగా ఉంటూ సొలిసిటలర్ జనరల్ బీజేపీ నేతలను కలుస్తున్నారనే విషయాన్ని బయటపెట్టడం ద్వారా ఇటు న్యాయవ్యవస్థలోపాలను, బీజేపీ చీకటి వ్యవహారాలను టీఎంసీ వెలుగులోకి తెచ్చినట్లయింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ గెలుపొంది, మమత మూడో సారి సీఎం అయిన కొద్ది రోజులకే శారద కేసును తిరగదోడిన కేంద్రం.. సీబీఐని రంగంలోకి దింపి టీఎంసీ మంత్రులను అరెస్టు చేయించింది. ఆ సమయంలో మమత కోర్టులపై, కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీలో చేరిన సువేందు అధికారిని మాత్రం వదిలేసి, మిగతా వారిని అరెస్టు చేయడాన్ని టీఎంసీ తప్పు పట్టింది.
సొలిసిటర్ జరనల్ తో సువేందు అధికారి భేటీ కావడం ఈ కేసుల విచారణపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రధానికి రాసిన లేఖలో టీఎంసీ పేర్కొంది. ఈ కేసులను విచారిస్తున్న సీబీఐ, ఈడీలకు తుషార్ లీగల్ అడ్వైజర్ అని, అలాంటాయన నిందితుడితో భేటీ కావడం సొలిటర్ జనరల్ పదవికే మచ్చ తీసుకొచ్చేలా ఉందని, వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోకుండా ఉండాలంటే వెంటనే తుషార్ ను తొలగించాలని టీఎంసీ డిమాండ్ చేసింది. తుషార్ ఇచ్చుకున్న వివరణపై సంతృప్తి చెందని టీఎంసీ.. ఈ అంశంపై మరింత పోరాడేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications