కొన్ని నిర్ణయాలు అన్యాయమే కానీ.. అగ్నిపథ్ పథకంపై ప్రధాని మోడీ పరోక్ష వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సర్వీసులో తీసుకున్న నాలుగేళ్లకే ఆర్మీ జవాన్లకు రిటైర్మెంట్ ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయంపై అభ్యర్ధులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులంతా అగ్నిపథ్ ను సమర్ధించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అగ్నిపథ్ సైనిక రిక్రూట్మెంట్ పథకానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో.. అనేక నిర్ణయాలు మొదట అన్యాయంగా అనిపించవచ్చు, కానీ తరువాత దేశాన్ని నిర్మించడంలో సహాయపడతాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగళూరులో నిర్వహించిన ఓ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ.. అగ్నిపథ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఎక్కడా అగ్నిపథ్ పేరెత్తకుండానే ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
హింసాత్మక నిరసనలను ప్రేరేపించిన తాత్కాలిక రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపథ్ పై ప్రజాసంఘాలు ఇవాళ అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇవాళ కూడా రైల్వేలు 500కు పైగా రైళ్లను రద్దు చేశాయి. గత వారం ప్రకటన చేసినప్పటి నుండి నిరసనకారులు చేసిన విధ్వంసం కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. అగ్నిపథ్ పథకం కింద, 17.5 నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ, యువకులను సాయుధ దళాలలో నాలుగేళ్ల కాలానికి రిక్రూట్ చేస్తారు.
వీరిలో చాలా మందికి ఎలాంటి గ్రాట్యుటీ లేదా పెన్షన్ లేకుండానే చివరిలో పదవీ విరమణ చేస్తారు.పోలీసు, పారామిలటరీ బలగాలు, హోం మరియు రక్షణ మంత్రిత్వ శాఖలతో సహా "అగ్నివీర్స్" కోసం అనేక ఉపాధి మార్గాలను ప్రకటించినప్పటికీ, పథకాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం నిరాకరించింది.