ఏదో ఒకరోజు ప్రభుత్వం అక్కడికే వెళుతుంది: అరుంధతీ రాయ్ హాట్ కామెంట్స్
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో నిరసనలకు సంఘీభావం తెలిపారు ప్రముఖ బుకర్స్ ప్రైజ్ అవార్డు గ్రహీత అరుంధతీ రాయ్. నిరసనలు చేపట్టిన విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన అరుంధతీ రాయ్ సరికొత్త వివాదానికి తెరతీశారు. నిర్బంధ గృహాల గురించి మాట్లాడుతూ అంతా కలిసి ఉంటే ఏ నిర్బంధ గృహం సరిపోదని చెప్పారు. ప్రభుత్వం డిటెన్షన్ సెంటర్కు వెళ్లే రోజు త్వరలో వస్తుందని వ్యాఖ్యానించారు అరుంధతీ రాయ్. అప్పుడూ తమకు నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని చెప్పారు. అప్పటి వరకు వెనక్కు తగ్గేది లేదని ఆమె అన్నారు.
పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు తెలుపుతున్న జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని ఖండిస్తూ విద్యార్థులకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీలు కదిలివచ్చాయి. ఇప్పటికే ఎన్ఆర్సీతో ముస్లింలకు అన్యాయం చేస్తుండగా తాజాగా పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చి ముస్లిం సామాజిక వర్గం వారికి భారత్లో చోటు లేకుండా చేసే ప్రయత్నం బీజేపీ సర్కార్ చేస్తోందని నిరసనకారులు మండిపడ్డారు. ఓ వైపు ప్రభుత్వం ఎన్ఆర్సీ పై చర్చిండం లేదని ప్రభుత్వం చెబుతూనే మరోవైపు పౌరసత్వం కోల్పోయిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతోందని నిరసనకారులు విమర్శించారు.
ఇస్లామిక్ దేశాల్లో మైనార్టీలుగా ఉన్నవారు భారత్లో పౌరసత్వం పొందుతారని ఓ వైపు చెబుతూనే మరో వైపు దేశంలో డిటెన్షన్ సెంటర్లు లేవని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం దేనికి సంకేతమని నిరసనకారులు ప్రశ్నించారు. అయితే నిర్బంధ కేంద్రాలు దేశంలో ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. ఇక జనవరి 10వ తేదీన కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేయడంతో పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. అంటే ఎవరు ఎన్ని ఆందోళనలు చేసినప్పటికీ పౌరసత్వ సవరణ చట్టంపై వెనక్కు తగ్గేదిలేదని కేంద్రం స్పష్టం చేసినట్లయ్యింది.
పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర హొంశాఖ గెజిట్ విడుదల చేసినప్పటికీ ఆందోళనలు నిరసనలు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్లో డజనుకు పైగా మృతి చెందారు. ఇదిలా ఉంటే ప్రజాస్వామ్యం కోసం హాంగ్కాంగ్లో గత కొన్ని నెలలుగా ఉద్యమం, నిరసనలు జరుగుతున్నప్పటికీ .. కేవలం కొన్ని వారాలుగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు మరింత బలంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.