మీడియాతో దురుసు: అల్లుడికి సోనియా క్లాస్!
ఈ ఘటన పట్ల వాద్రాపై భారతీయ జనతా పార్టీ సహా కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలన్నీ విమర్శలు ఎక్కుపెట్టడంతో ఆదివారం సోనియాగాంధీ ఆయనను తన నివాసానికి పిలిపించి మందలించినట్లు తెలిసింది. మరోవైపు వాద్రాపై బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంది.
వాద్రా గతంలో కూడా భారత్ను బనానా రిపబ్లిక్, ప్రజలను మ్యాంగో పీపుల్ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ, దేశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి కుటుంబం పాలనాకాలంనాటి బనానా రిపబ్లిక్ ఎంతమాత్రం కాదన్న విషయం ఆయన తెలుసుకోవాలి అని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు.
వాద్రాది కచ్చితంగా అనుచితమైన ప్రవర్తనేనని, దీనిపై కేంద్ర సమాచార ప్రసారశాఖ ఎలా స్పందిస్తుందో చూడాలని సీపీఐ నేత డి రాజా వ్యాఖ్యానించారు. మీడియాకు వాద్రా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బ్రాడ్కాస్టింగ్ ఎడిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్కే సింగ్ డిమాండ్ చేశారు.
కాగా, మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించిన రాబర్ట్ వాద్రాపై బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాబర్ట్ వాద్రా ఓ దోపిడీదారు అని, వాద్రా ఎప్పుడూ అహంకారంగా ప్రవర్తిస్తుంటారని అన్నారు. ఆయనకు కల్పించిన ఎస్పిజి భద్రతను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. వాద్రా నుంచే సమాజానికి రక్షణ కావాలని అన్నారు.
ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ ప్రతినిధి సందీప్దీక్షిత్ కూడా వాద్రా ప్రవర్తన దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. కాగా, విపక్షాల విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. చిన్నవిషయాన్ని మీడియా పెద్ద వివాదంగా మార్చిందని, వాధ్రా చట్ట ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆధారాలుంటే విచారణ జరుపుకోవచ్చని కాంగ్రెస్ కార్యదర్శి దిగ్విజయ్సింగ్ స్పష్టం చేశారు. ఒకే ప్రశ్నను మీడియా ప్రతినిధి పదేపదే రెట్టించి అడుగటంవల్లనే వాద్రా సహనం కోల్పోయారని, ఈ ఘటనలో మీడియా ప్రతినిధిదే తప్పని కాంగ్రెస్ నేత రణ్దీప్సింగ్ సుర్జేవాలా అన్నారు.