మైనార్టీలపై దాడులు, ప్రజల్లో నిరంతరం అభద్రతాభావం-కేంద్రంపై నిప్పులు చెరిగిన సోనియా గాంధీ
వరుస పరాజయాలతో మనసబారుతున్న ఉనికిని కాపాడుకునేందుకు రాజస్ధాన్ లో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ నిర్వహిస్తోంది. ఇందులో పార్టీ పెద్దలు సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు 400 మంది నేతలు పాల్గొంటున్నారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో నేతల్ని ఉద్దేశించి ప్రసంగించిన సోనియా గాంధీ.. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరుగుతున్న పార్టీ చింతన్ శిబిర్ మూడు రోజుల మేధోమథన సమావేశాన్ని ఇవాళ ప్రారంభించారు. బిజెపి, ప్రధాని మోడీపై ఘాటైన విమర్శలతో ఆమె కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రజల్లో నిరంతరం అభద్రతాభావం నింపుతోందని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా మైనార్టీలపై దాడులు నానాటికీ ఎక్కువవుతున్నాయని సోనియా ఆక్షేపించారు.
'గరిష్ట పాలన, కనీస ప్రభుత్వం' నినాదం వినిపిస్తున్న ప్రధాని మోదీ, ఆయన సహచరులు వాస్తవంగా దాని అర్థం ఏమిటనేది ఇప్పటికీ చెప్పలేకపోతున్నారని సోనియా విమర్శిచారు. దేశాన్ని శాశ్వతం వివక్షా పూర్వక స్థితిలో ఉంచడం, ప్రజలను అణచివేయడం, భయపెట్టడం సర్వసాధారణంగా మారాయని సోనియా ఆరోపించారు. భారత్ లో భాగమైన మైనార్టీలను బాధితులుగా మారిస్తూ చేస్తున్న దాడుల్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ విద్వేష మంటలు వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. ఇది తీవ్రమైన సామాజిక ప్రభావాలకు కారణమవుతోందని, ఇది మనం ఊహిస్తున్న దానికంటే చాలా ఎక్కువని సోనియా ఆరోపించారు. పెరుగుతున్న ఈ విభజన వైరస్ను కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి ఉందని సోనియా గాంధీ అన్నారు.
బిజెపి, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థల విధానాల ఫలితంగా దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను మన మధ్య చర్చించుకోవడానికి 'నవ్ సంకల్ప్ చింతన్ శివిర్' అవకాశం కల్పిస్తుందని కాంగ్రెస్ నేతలనుద్దేశించి సోనియాగాంధీ తెలిపారు.మే 13, 14 మరియు 15 తేదీల్లో ఉదయ్పూర్లో కాంగ్రెస్ చింతన్ శివిర్ నిర్వహిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేయడం మేధోమథన సెషన్లోని ప్రధానాంశం.