Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రజలకి మాపై ఆగ్రహం: సోనియా, దెబ్బతీశాడు: కేజ్రీవాల్

Sonia Gandhi
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే విషయం ఈ ఎన్నికల ఫలితాలతో తేలిందని, ఫలితాలతో తాము అసంతృప్తి చెందామని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం అన్నారు. నాలుగు రాష్ట్రాల (మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్) ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోనియా, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని, ఓటమి పైన తాము సమీక్షించుకుంటామని సోనియా చెప్పారు. ఫలితాలపై లోతైన ఆత్మ పరిశీలన అవసరమన్నారు. గెలుపొందిన అభ్యర్థులందరికీ తాను అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. సాధారణ ఎన్నికలకు, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు.

రాష్ట్రాల ఎన్నికల్లో స్థానిక నాయకత్వం ప్రభావం పని చేస్తుందన్నారు. సాధారణ ఎన్నికలలో ప్రజలు దేశవ్యాప్త ఆలోచనతో ఓటు హక్కును వినియోగించుకుంటారన్నారు. 2014 ప్రధాని అభ్యర్థిని తాము త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. షీలా ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లుందని, అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయన్నారు.

దిమాక్ కాదు దిల్‌తో: రాహుల్

ఈ ఎన్నికల ఫలితాలను తమ పార్టీ దిమాక్‌తోనే కాకుండా దిల్‌తో ఆలోచించాలని రాహుల్ అన్నారు. కాంగ్రెసుకు ఈ ఫలితాలు గుణపాఠం లాంటివన్నారు. గెలిచిన ప్రత్యర్థులకు అభినందనలు తెలియజేసిన రాహుల్... ప్రజల అంచనాలకు అనుగుణంగా తమ ప్రభుత్వాలు పని చేయడం లేదని భావిస్తున్నామన్నారు. షీలా దీక్షిత్ ప్రభుత్వం మంచి పాలన ఇచ్చినా ప్రజల అంచనాలకు అనుగుణంగా ఇవ్వలేకపోయారన్నారు.

ఢిల్లీలో సాధ్యమైనంత మేర ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పించామని రాహుల్ తెలిపారు. కాంగ్రెసు పార్టీ నేతల్లో పరివర్తన తెచ్చే ప్రయత్నాలు చేస్తామన్నారు. నాయకులను ఏకతాటిపై నడిపే ప్రయత్నాలు చేస్తామన్నారు. రాజకీయాలను ఇప్పటి వరకు మన సంప్రదాయ పద్ధతుల్లోనే చూస్తున్నామని, ప్రజల సాధికారతను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలను చూడాలన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలతో మమేకమైందని, ప్రజల మధ్యనే పని చేసిందని కితాబిచ్చారు. కాంగ్రెసు పార్టీ, బిజెపిల దృక్పథాలు వేరని, దేశ ప్రజలకు సాధికారత ఇవ్వడంలో తమకు దృక్పథం ఉందన్నారు. ప్రజలు ఈ ఫలితాల ద్వారా తమకు సందేశం ఇచ్చారన్నారు.

కాంగ్రెస్‌కు చెంపపెట్టు: వెంకయ్య

నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెసు పార్టీకి చెంప పెట్టు అని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ సంక్షేమ పథకాల వల్లనే తాము మధ్యప్రదేశ్‌లో మూడోసారి గెలుపొందామన్నారు. కాంగ్రెసు తమ పార్టీపై ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మలేదన్నారు. బస్తర్‌లో కాంగ్రెసుకు సానుభూతి పవనాలు వీచాయని, దేశ రాజధానిలోనే కాంగ్రెసు సింగిల్ డిపాజిట్ దక్కే దయనీయస్థితిలో ఉండిపోయిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెసుపై వ్యతిరేకత ఉంటుందన్నారు. మోడీ ప్రభావం దేశవ్యాప్తంగా వీస్తుందన్నారు. భావి ప్రధాని మోడీయే అన్నారు.

ఢిల్లీలో షీలా దీక్షిత్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా బిజెపిదే భవిష్యత్తు అన్నారు.

చారిత్రాత్మక విజయం: కేజ్రీవాల్

ఇది చారిత్రాత్మక విజయమని ఎఎపి అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అవినీతి కాంగ్రెసు, బిజెపిలను తరిమి కొట్టేందుకు అవకాశం వచ్చిందన్నారు. అవినీతే ఈ ఎన్నికల్లో ప్రధాన అంశమన్నారు. సామాన్యుడు కూడా అధికారం చేజిక్కించుకోవచ్చునని ఢిల్లీ ఫలితాలు నిరూపించాయన్నారు. అవినీతి, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది అన్నారు. రాజకీయ ఉద్దండులను సామాన్యుడు దెబ్బతీశాడన్నారు. సమర్థ ప్రతిపక్ష పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాము అవినీతికి, ధరల పెరుగుదలకు వ్యతిరేకమన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+