కేంద్రమంత్రి రవిశంకర్ ట్విట్టర్ ఖాతా బ్లాక్: రెహమాన్ ‘మా తుజే సలామ్’ పాటతో సంబంధమేంటి?
న్యూఢిల్లీ: నూతన ఐటీ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య కొనసాగుతున్న వివాదం ముగియకముందే కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అకౌంట్ను బ్లాక్ చేయడం సంచలనంగా మారింది. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ తాత్కాలికంగా కేంద్రమంత్రి ఖాతాను నిలిపేసింది ట్విట్టర్.
ఈ క్రమంలో కేంద్రమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే సుమారు గంట తర్వాత ఖాతాను అన్బ్లాక్ చేసింది. అంతేగాక, తమ నిబంధనలు ఉల్లంఘిస్తే మళ్లీ బ్లాక్ చేస్తామని హెచ్చరించడం గమనార్హం. రవిశంకర్ ప్రసాద్ అమెరికన్ డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టాన్ని(డీఎంసీఏ) ఉల్లంఘించారని ట్విట్టర్ ఆరోపించింది.
కాగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపర్చిన 'మా తుఝే సలాం' అనే పాటను కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తన ట్వీట్లో షేర్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ పాటపై సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్కు కాపీరైట్ హక్కులున్నాయి. దీంతో ఈ సంస్థ తరపున ట్విట్టర్కు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది ఫొనోగ్రాఫిక్ ఇండస్ట్రీ ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలోనే డీఎంసీఏ నిబంధనల ప్రకారం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసింది. కాగా, తన ఖాతాను బ్లాక్ చేయడంపై కేంద్రమంత్రి తీవ్రంగా స్పందించారు. నోటీసులు ఇవ్వకుండా ఖాతాను నిలిపివేయడం.. నూతన ఐటీ నిబంధనలను ఉల్లంఘించడమేనంటూ మరో సోషల్ మీడియా వేదిక 'కూ'లో వరుస పోస్టులు పెట్టారు. తన ఖాతాను గంటపాటు యాక్సెస్ చేసుకోనివ్వలేదని తెలిపారు. చట్టాన్ని ధిక్కరించేలా ట్విట్టర్ చర్యలున్నాయన్నారు.