చైనా ఖేల్ ఖతం!: భారత ఆర్మీ ఆధీనంలోకి సౌత్ ప్యాంగ్యాంగ్, డ్రాగన్ కవ్వింపు చర్యలు ఇకసాగవు
న్యూఢిల్లీ: చైనా కవ్వింపు చర్యలకు భారత జవాన్లు గట్టిగా బుద్ధి చెప్పారు. మన సరిహద్దులోకి ప్రవేశించాలని ప్రయత్నించిన చైనా బలగాలను వెనక్కినెట్టిన భారత జవాన్లు.. వివాదాస్పదంగా మిగిలిన సౌత్ ప్యాంగ్యాంగ్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ వివాదాస్పద ప్రాంతమంతా భారత ఆధీనంలోకి వచ్చినట్లయింది.
Recommended Video

ఆ ప్రాంతంలో భారీగా భారత బలగాలు
వాస్తవాధీన రేఖ వెంబడి భారత దళాలు ఎప్పటికప్పుడు చైనా కవ్వింపు చర్యలను తిప్పికొడుతూనే ఈ విజయాన్ని సాధించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భారీగా భారత జవాన్లు మోహరించారు. చైనా మరోసారి ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా.. మరింత గట్టిగా బుద్ధి చెబుతామని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.

భారత విజయం.. చైనాకు గట్టి దెబ్బే..
ఈ ప్రాంతాన్ని భారత బలగాలు స్వాధీనం చేసుకోవడం చైనాకు గట్టి ఎదురుదెబ్బగానే సీనియర్ అధికారులు తెలిపారు. సరిహద్దు వాస్తవాధీన రేఖకు సమీపంలో చైనా ట్యాంకులు, బలగాలను మోహరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతం భారత సైన్యం ఆధీనంలో ఉండటమనేది పెద్ద విజయమనే చెప్పవచ్చన్నారు. ఎందుకంటే చైనా బలగాలు, ట్యాంకులు, ఇతర వాహనాల కదలికలను ఈ ప్రాంతం నుంచి భారత సైన్యం గమనించేందుకు వీలుగా ఉంటుంది.

రెండ్రోజుల క్రితమే ఆ ప్రాంతం భారత ఆధీనంలోకి..
ఆగస్టు 29-30 రాత్రి సమయంలో భారత సైన్యం సౌత్ ప్యాంగ్యాంగ్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఓ వైపు శాంతి చర్చలంటూనే చైనా మాత్రం సరిహద్దులో బలగాలను మోహరిస్తుండటంతో.. ఆ డ్రాగన్ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సైన్యం సిద్ధమైంది. ఈశాన్య లడఖ్లో జరిగిన ఘర్షణల అనంతరం చర్చలకు సిద్ధమంటూ చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ చైనా మాత్రం తన తప్పును అంగీకరించకపోవడం, బలగాలను పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోకపోవడంతో ఆ చర్చలన్నీ విఫలమవుతూనే వస్తున్నాయి.

కీలక ప్రాంతం మన చేతిలో.. ఇక చైనా ఏం చేసినా..
ప్రస్తుతం ఈ ఎత్తైన ప్రాంతం భారత బలగాల ఆధీనంలో ఉండటంతో స్పాంగ్గుర్ గ్యాప్ ప్రాంతంలో చైనా చేపట్టే సైనిక చర్యలు మన జవాన్లకు తెలిసిపోతాయి.
స్పాంగ్గుర్ సరస్సు ప్రాంతంలో చైనా ఇప్పటికే ఓ రోడ్డును నిర్మిస్తున్నట్లు భారత దళాలు గుర్తించాయి. ఈ మార్గం గుండా భారీ ట్యాంకులు, వాహనాలు, బలగాలను చైనా తరలించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ప్రస్తుతం సౌత్ ప్యాంగ్యాంగ్ ప్రాంతం భారత దళాల ఆధీనంలో ఉండటంతో చైనా ఎలాంటి చర్యలకు పాల్పడినా మన సైనికులు తెలిసిపోతుంది. దీంతో తగినట్లుగా జవాబు ఇచ్చేందుకు భారత దళాలు సిద్ధమవుతాయి. కాగా, ప్రస్తుతం మొదటి దఫా బ్రిగేడియర్ స్థాయి చర్చలు విఫలం కావడంతో రెండో దఫా చర్చలు భారత్, చైనాల మధ్య సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications