చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలి ఇల్లు దగ్ధం: మహిళకు గాయాలు
చెన్నై: ఇంట్లో చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ పేలి మంటలు వ్యాపించడంతో ఇల్లు దగ్ధమైన ఘటన చెన్నైలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, చెన్నైలోని కోయంబేడు సమీపంలోని నెర్కుండ్రంకు చెందిన ఝాన్సీ అనే 52 ఏళ్ల మహిళ పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది.
ఎప్పటిలాగే బుధవారం రాత్రి ఝాన్సీ తన ఫోన్కు చార్జింగ్ పెట్టి నిద్రపోయింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సెల్ఫోన్ హఠాత్తుగా పేలింది. దీంతో ఇంటిలో మంటలు వ్యాపించాయి. ఇంటిపై కప్పు వరకు మంటలు వ్యాపించడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.
ఈ ప్రమాదంలో ఝాన్సీకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటతో సదరు కుటుంబసభ్యులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ఘటనపై కోయంబేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ పేలిపోయి మంటలు వ్యాపించి ఇల్లు తగలబడటం గత తొమ్మిది రోజుల్లో ఇది మూడోసారి. జనవరి 25న చెన్నైలోని వైసార్పాడి ప్రాంతంలో భక్తవాచాలం కాలనీలోని ఓ ఇంట్లో సెల్ఫోన్ పేలిన క్రమంలో ఆ మంటలు సిలిండర్కు వ్యాపించి ముగ్గురు సజీవ దహనమయ్యారు.
ఫిబ్రవరి 2వ తేదీన సెల్ఫోన్ను ఛార్జింగ్ పెట్టి మాట్లాడిన 9 ఏళ్ల బాలుడు ఆ తర్వాత జరిగిన ఘటనలో తన రెండు కంటి చూపును కోల్పోయేంత ప్రమాదం చోటుచేసుకుంది.