పిఎన్బీ స్కాం, రాఫెల్ డీల్పై మన్కీ బాత్లో నోరు విప్పాలి: రాహుల్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంతో పాటు రాఫెల్ స్కాంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు మెదపకపోవడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన్కీ బాత్ కార్యక్రమంపై సలహలను, సూచనలు ఇవ్వాలని మోడీ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్పై రాహుల్ స్పందిస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ పై ఈ దఫా మన్కీ బాత్ కార్యక్రమంలో మోడీ ఈ అంశంపై మాట్లాడుతారని ఆశిస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పారు.
మన్ కీ బాత్ కార్యక్రమం విషయమై ఎందుకు సలహలు, సూచనలు కోరుతారని రాహుల్ ప్రశ్నించారు. గతంలో కూడ తాను నీరవ్ మోడీ, రాఫెల్ స్కామ్ గురించి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడాలని కోరిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు.
రాఫెల్ స్కాం గురించి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించాలని కోరుతూ 2018 జనవరి 28వ, తేదిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోడీకి ట్వీట్ చేశారు.
అయినా మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ నుండి స్పందన రాలేదని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకులను పెద్ద పారిశ్రామికవేత్తలు ఏ రకంగా కొల్లగొట్టారనే విషయమై రాహుల్ గాంధీ ప్రస్తావించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ తదితరులు బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి ప్రజా సంపదను కొల్లగొట్టారని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
నీరవ్ మోడీ, విజయ్ మాల్యా కుంభకోణాలు బయటకు వచ్చిన తర్వాత అవినీతి నిర్మూలన అనేది కేంద్ర ప్రభుత్వంతో సాధ్యం కాదని తేలిందన్నారు. ఈ అవినీతిలో ప్రభుత్వం కూరుకుపోయిందన్నారు రాహుల్.