స్మృతిఇరానీ లెటర్ హెడ్లో అక్షర దోషాలు, నెట్లో పోస్ట్
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ లెటర్ హెడ్లో అక్షర దోషాలు వచ్చాయి. దీంతో, దీనిపైన విచారణకు ఆదేశించారు. తన తరఫున పంపిన లెటర్ హెడ్ల పైన అక్షర దోషాలు ఉండటంతో దీనిపై వివరణ ఇవ్వాలని స్మృతి తన మంత్రివర్గ అధికారులను అడిగారు.
స్మృతీ ఇరానీ ఇటీవల దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరికీ ఉత్తరాలు పంపించారు. వాటిల్లో కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి. ఇది తెలిసిన స్మృతీ ఇరానీ శుక్రవారం విచారణకు ఆదేశించారు.
చదువులో విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచినందుకు స్మృతీ ఇరానీ ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు తన పేరుతో 'ధన్యవాదాలు' అంటూ లెటర్ని పంపించారు.
అందులో 'మినిస్టర్', 'సన్సాధన్' పదాలు తప్పుగా అచ్చయ్యాయి. ఆ ఉత్తరం అందుకున్న రిచా కుమార్ అనే ఉపాధ్యాయురాలు అందులోని తప్పులను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది నెట్లో హల్చల్ చేస్తోంది. దీనిపై స్మృతి తన శాఖ అధికారులను ప్రశ్నించారు. దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.