మైసూరు సంస్థాన యువరాజు వొడయార్ కన్నుమూత
బెంగళూరు: మైసూరు సంస్థానపు చివరి యువరాజు శ్రీకంఠదత్త నరసింహరాజ వొడయార్(60) కన్నుమూశారు. బెంగళూరు ప్యాలెస్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన భార్య ప్రమోదా దేవి. ఈ దంపతులకు సంతానం కలగలేదు. శ్రీకంఠదత్త నరసింహరాజ వొడయార్ 1953లో మైసూరు మహారాజు జయచామరాజేంద్ర ఒడయార్, మహారాణి త్రిపుర సుందరి అమ్మణి దంపతులకు జన్మించారు.
చదువుల్లో మేటిగా ఉంటూ మైసూరు యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పిజి చేశారు. ఆ వర్సిటీ క్రికెట్ టీమ్ కెప్టెన్గా సేవలందించిన ఆయన 2010లో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. డిసెంబర్ 1న అసోసియేషన్కు జరిగిన ఎన్నికల్లో మరోసారి భారీ మెజారిటీతో గెలుపొందారు. కాలేజీ వయసులో తాను వామపక్ష భావజాలంతో ఉండేవాడినని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
విదేశీ కార్లు, వాచీల సేకరణ ఆయనకు చాలా ఇష్టం. ఆయనకు 15 లగ్జరీ కార్లున్నాయి. వాటన్నిటికీ రిజిస్ట్రేషన్ నెంబర్ '1953' ఉంటుంది. 1974లో తండ్రి అనంతరం నరసింహరాజ వొడయార్ యువరాజుగా పట్టాభిషుక్తుడయ్యారు. ఫ్యాషన్ డిజైనర్ కూడా అయిన ఆయన మైసూరు సంప్రదాయ పట్టు వస్త్రాలకు మైసూరు రాచకుటుంబ రాయబారిగా వ్యవహరిస్తుండేవారు. నాలుగుసార్లు మైసూరు లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. కాంగ్రెసు, బిజెపిలలో పని చేశారు.
దేశంలోని అత్యంత సంపన్నులైన రాజవంశీకుల్లో వొడయార్ ఒకరు. 2004 లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన తన ఆస్తుల విలువ రూ.1522.53 కోట్లుగా పేర్కొన్నారు. మైసూరు సంస్థానాన్ని వొడయార్లు 1399 నుంచి 1947 దాకా పాలించారు. ఆ రాజ్యానికి చివరి రాజు శ్రీకంఠదత్త వొడయార్ తండ్రి జయచామరాజేంద్ర వొడయార్. కాగా శ్రీకంఠదత్త ఒడయార్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.